ముంబై: మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో బీజేపీ, శివసేన, ఎన్సీపీలు విఫలమవడంతో రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి కేంద్ర కేబినెట్ కూడా ఆమోదించనట్లు తెలుస్తోంది. ఇందు కోసం బ్రెజిల్ పర్యటనకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో కేంద్ర కేబినెట్ అత్యవసరంగా భేటీ అయినట్లు సమాచారం. ఎన్సీపీకి మంగళవారం రాత్రి 8.30 వరకు గడువు ఉన్నప్పటికీ… ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి కనపడకపోవడంతో… రాష్ట్రపతి పాలన కోసం కేంద్ర హోంశాఖకు గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ సిఫారసు చేసినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. అయితే, రాష్ట్రపతి పాలన విధించాలని ఎలాంటి సిఫారసూ చేయలేదని రాజ్ భవన్ వర్గాలు చెబుతున్నాయి.
మరోవైపు మహారాష్ట్రలో రాష్ర్టపతి పాలన విధిస్తారని వార్తలు ఊపందుకున్న నేపథ్యంలో శివసేన పార్టీ అప్రమత్తమైంది. ఎస్సీపీకి ఇచ్చిన గడువు ముగియకముందే గవర్నర్ రాష్ట్రపతి పాలనకు ఎలా సిఫార్సు చేస్తారని ప్రశ్నించింది. ఒక వేళ రాష్ర్టంలో రాష్ర్టపతి పాలన విధిస్తే సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు శివసేన సిద్ధమవుతుంది. డెడ్ లైన్ కంటే ముందే రాష్ట్రపతి పాలనకు గవర్నర్ సిఫార్సు చేయడంపై న్యాయపరంగా ఎలా వ్యవహరించాలనే దానిపై శివసేన నేతలు సీనియర్ న్యాయవాది, కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ తో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.
మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు విషయంలో గత 20 రోజులుగా ప్రతిష్టంభన కొనసాగుతోంది. 105 స్థానాలతో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ.. సరైన సంఖ్యాబలం లేకపోవడంతో ప్రభుత్వం ఏర్పాటు చేయలేమని గవర్నర్ను కలిసి తెలిపారు. ప్రభుత్వ ఏర్పాటుకు తగిన మద్దతు సాధించలేకపోయానని బీజేపీ చేతులెత్తేసిన వెంటనే రాష్ట్ర గవర్నర్ భగత్సింగ్ కోశ్యారీ.. రెండో అతి పెద్ద పార్టీ అయిన శివసేనను ఆహ్వానించిన విషయం తెలిసిందే. ప్రభుత్వ ఏర్పాటు విషయాన్ని సోమవారం సాయంత్రం 7-30 గంటల కల్లా చెప్పాలని గడువు పెట్టారు. కానీ ఆలోగా కాంగ్రెస్, ఎన్సీపీల నుంచి మద్దతుకు సంబంధించిన స్పష్టమైన హామీని సాధించడంలో శివసేన సఫలం కాలేకపోయింది. దీంతో గవర్నర్.. మూడో అతి పెద్ద పార్టీ అయిన ఎన్సీపీని ఆహ్వానించారు. ఈ పార్టీకీ ఆయన 24 గంటల గడువునే ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పరిచే బలముందా లేదా అన్నది మంగళవారం రాత్రి 8-30 గంటల కల్లా తేల్చిచెప్పేయాలన్నారు. అంటే ఇపుడు శివసేన మద్దతును ఎన్సీపీ కోరాలి. ఉద్ధవ్ ఠాక్రే సహకరిస్తే తప్ప ఎన్సీపీ- కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడదు. అసలు శివసేనతో దోస్తీకే విముఖంగా ఉన్న కాంగ్రెస్ కలిసొచ్చేదీ లేనిదీ కూడా అనుమానమే. బీజేపీ అంచనా ప్రకారం- ఎన్సీపీ కూడా ఈ విషయంలో విఫలం కావొచ్చు. అంతిమంగా గవర్నర్ .. రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేసే పరిస్థితి ఏర్పడవచ్చని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.