సర్జికల్ స్ట్రైక్పై భారత విదేశాంగ శాఖ అధికారిక ప్రకటన చేసింది. పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నామని, పెద్ద సంఖ్యలో జైషే ఉగ్రవాదులను హతమార్చామని విదేశాంగ కార్యదర్శి విజయ్ గోఖలే వెల్లడించారు.
మంగళవారం తెల్లవారుజామున భారత్ నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్పై ఆయన మీడియాతో మాట్లాడారు. పాకిస్థాన్ కేంద్రంగా జైషే మహ్మద్ రెండేళ్లుగా క్రియాశీలకంగా పనిచేస్తున్నదని, భావల్పూర్ నుంచి వరుసగా ఉగ్రదాడులకు పాల్పడుతోందని గోఖలే తెలిపారు.
పుల్వామాలో భారత ఆర్మీ కాన్వాయ్పై జైషే మహమ్మద్ ఆత్మాహుతి దాడికి పాల్పడిన తరువాత పాకిస్థాన్ చర్యలు తీసుకుంటుందని ఆశించామని, కానీ, ఆ దేశం వైపు నుంచి ఎటువంటి స్పందనా లేదని గోఖలే వెల్లడించారు.
భారత్లోని పలు ప్రాంతాల్లో మరిన్ని ఆత్మాహుతి దాడులకు ఉగ్రవాదులు ప్లాన్ చేస్తున్నారన్న పక్కా సమాచారం తమకు అందిందని, అందువల్లే వారు తెగబడక ముందే మట్టుబెట్టాలన్న నిర్ణయానికి వచ్చామని ఆయన స్పష్టం చేశారు. డ్రోన్ కెమెరాల సాయంతో దాడులు చేసినట్లు పేర్కొన్నారు.
‘ జైషే మహ్మద్కు చెందిన అతిపెద్ద ఉగ్ర శిబిరమైన బాలకోట్లో దాడి చేశాం. ఈ ఆపరేషన్లో పెద్ద సంఖ్యలో జైషే ఉగ్రవాదులు, శిక్షకులు, సీనియర్ కమాండర్లు, జిహాదీలను మట్టుబెట్టాం. ఈ ఉగ్రశిబిరం జైషే అధినేత మౌలానా మసూద్ అజార్ బావమరిది మౌలానా యూసఫ్ అజార్ అలియాస్ ఉస్తాద్ ఆధ్వర్యంలో నడుస్తోంది. దట్టమైన అడవుల్లో ఉన్న ఈ శిబిరంలో ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్నారు’ అని గోఖలే తెలిపారు.
ఈ దాడి మసూద్ అజర్ కు కోలుకోలేని దెబ్బేనని గోఖలే పేర్కొన్నారు. ఉగ్ర సంస్థలపై చర్యలు తీసుకుంటామన్న హామీని పాక్ ఇప్పటికైనా నిలబెట్టుకోవాలని విజయ్ గోఖలే సూచించారు.