న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు మంగళవారం జవాబిచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాంగ్రెస్పై దాడికి తన ప్రసంగాన్ని ఉపయోగించుకున్నారు. ఎన్నికల ప్రచారంలో విరివిగా వాడిన కుటుంబ పాలన విమర్శను మళ్లీ ఎక్కుపెట్టారు.
మీరు చాలా పైకి ఎదిగిపోయారు. ఎంత ఎదిగారంటే కింద నేలతో మీ సంబంధాలు తెగిపోయాయి. మీరు ఇంకా పైకి ఎదగాలని కోరుకుంటున్నాను అని సోనియా గాంధీ కుటుంబాన్ని ఉద్దేశించి మోదీ వ్యాఖ్యానించారు. మేము క్షేత్రస్థాయిలోనే ప్రజలకు దగ్గరగా ఉండి వారిని బలోపేతం చేస్తాం అని ఆయన అన్నారు.
ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించింది ఈ రోజేనని గుర్తు చేస్తూ ఆయన తన దాడి కొనసాగించారు. జూన్ 25వ తేదీ రాత్రి జాతి ఆత్మను అణగదొక్కారని ఆయన వ్యాఖ్యానించారు. గాంధీ కుటుంబం తప్ప కాంగ్రెస్లో ఎవరికీ ప్రాధాన్యత లేదన్న తన విమర్శను కొనసాగిస్తూ, 2004 నుంచి 2014 మధ్య వాజ్పేయీ, పివి నరసింహారావు ప్రభుత్వాలు చేసిన మంచి పనులను ఎవరన్నా గుర్తు చేసుకున్నారా. వీరికి ఆఖరికి మన్మోహన్ సింగ్ కూడా గుర్తు లేరు, అని మోదీ పేర్కొన్నారు.
2014లో కాంగ్రెస్ నుంచి తప్పించుకునేందుకు ప్రజలు బిజెపిని ఎన్నుకున్నారనీ, 2019లో తమ ప్రభుత్వం గత అయిదేళ్లలో చేసిన మంచి పనులు చూసి ఇంకా ఎక్కువ సీట్లు ఇచ్చారనీ ఆయన అన్నారు. అయితే విజయం అంత తేలికగా లభించలేదనీ, విపరీతంగా శ్రమించాల్సి వచ్చిందనీ ఆయన అన్నారు.
తమ ప్రభుత్వం సంక్షేమాన్ని విస్మరించబోదని ఆయన పేర్కొన్నారు. నీటి కొరత తీర్చడం తమ ప్రధమ కర్తవ్యమని ఆయన చెప్పారు. ప్రతి ఇంటికీ నీరు అందించడం తమ లక్ష్యమని ఆయన అన్నారు. రాజకీయ స్పర్ధలు ఎన్నికల వరకేననీ, జాతి నిర్మాణలో పాలు పంచుకోవడానికి ప్రతిపక్షాలు కలిసిరావాలనీ ఆయన పిలుపునిచ్చారు.
మహాత్మా గాంధీ 150 వ జయంతి, 75 వ స్వాతంత్ర్య దినోత్సవం ఘనంగా జరుపకుందామని ఆయన పేర్కొన్నారు.