‘Photo Courtesy: NDTV
న్యూఢిల్లీ: దేశంలో ముస్లింలు, దళితులు, ఇతర మైనారిటీల మూకహత్యలు ఎక్కువవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి బహిరంగ లేఖ రాసినందుకు 49 మంది మేధావులు, ప్రముఖులపై దేశద్రోహం కేసు పెట్టడం మీద కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ వెంటనే స్పందించారు. ‘ఈ దేశంలో ఏం జరుగుతోందో అందరికీ తెలుసు. దేశం నియంతృత్వ పాలనలోకి వెళుతోంది. ప్రధానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వారిని జైలులో పెడుతున్నారు. మీడియాను అణచివేస్తున్నారు. అందరికీ తెలుసు ఏం జరుగుతుందో. ఇందులో రహస్యం ఏమీ లేదు’ అని రాహుల్ వ్యాఖ్యానించారు.
లేఖపై సంతకం చేసినవారిలో ఒకరైన ప్రముఖ మళయాళ సినిమా దర్శకుడు అదూర్ గోపాలకృష్ణన్ ఏమవుతోంది మనకు అని ఆవేదనగా ప్రశ్నించారు. కేసు పెట్టడంపై ఆయన స్పందన కోసం ఎన్డిటివి వెళ్లినపుడు నమ్మలేకపోతున్నానని ఆయన అన్నారు. ఆ లేఖ రాసినందుకు ఏ కోర్టయినా గానీ దేశద్రోహం కేసు పెట్టడం ఊహాతీతంగా ఉంది అని అదూర్ వ్యాఖ్యానించారు. ఎవరైనా ప్రభుత్వాన్ని విమర్శిస్తే అది దేశద్రోహం కాదు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం అని ఆయన అన్నారు.
కేసు పెట్టడం ఆ లేఖలో రాసిన అంశాల స్ఫూర్తికే విరుద్ధమని గోపాలకృష్ణన్ అన్నారు. మూకహత్యలు ఆపాలని కోరడంతో పాటు, జై శ్రీరాం అన్న మాట హింసకు పాల్పడేవారి నినాదంగా మారిపోయిందని ఆ లేఖలో రాశారు. ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసంతో ఆ లేఖ రాశామనీ, భిన్న అభిప్రాయాలను గౌరవించకపోతే అది ప్రజాస్వామ్యం కాదనీ ఆయన అన్నారు. అదూర్తో పాటు సినీ ప్రముఖులు మణిరత్నం, అపర్నా సేన్, ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ కూడా సంతకం చేసిన వారిలో ఉన్నారు.