(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
అయోధ్యలోని రామజన్మభూమి-బాబ్రీ మసీదు స్థల వివాదం కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన చారిత్రాత్మకమైన తీర్పు ప్రతిని శ్రీరాముడికి స్వయంగా సమర్పించనున్నారు న్యాయవాదులు. ఈ కేసులో రామ్ లల్లా విరాజ్మాన్ తరపున కోర్టులో వాదించిన న్యాయవాదులు నవంబర్ 24న అయోధ్య రామ జన్మభూమి ఆలయాన్ని సందర్శించి సుప్రీం కోర్టు తీర్పు ప్రతిని రామ్ లల్లాకు స్వయంగా అందజేయనున్నారు. ఈ సందర్భంగా న్యాయవాదులకు అయోధ్యలో సన్మానం జరగనుంది. తీర్పు వెలువడిన తరువాత అయోధ్యలో జరుగుతున్న భారీ ఉత్సవం ఇదే కానుంది. న్యాయవాదుల బృందంతో పాటు విశ్వ హిందూ పరిషత్ నాయకులు కూడా వెళ్లనున్నారు. ఈ కేసులో సీనియర్ న్యాయవాది కేశవ్ పరాశరన్తో సహా మరో 20 మందికి పైగా సీనియర్ న్యాయవాదులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం హనుమాన్ గఢి ఆలయాన్ని సందర్శిస్తారు.
ఈ కార్యక్రమం కరసేవక్పురంలో జరుగుతుందని అయోధ్య జిల్లా మేజిస్ట్రేట్ అనుజ్ ఝా తెలిపారు. ఈ కార్యక్రమంలో చాంపత్ రాయ్, దినేష్ చంద్రతో సహా వీహెచ్పీ నాయకులు హాజురుకానున్నారు. సీనియర్ న్యాయవాదుల బృందం పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించే బాధ్యతను ముగ్గురు మెజిస్ట్రేట్లకు రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది.
దశాబ్దాలుగా నలుగుతున్న అయోధ్య భూవివాదం కేసుపై సుప్రీంకోర్టు నవంబర్ 9న చారిత్రాత్మకమైన తీర్పును ఇచ్చింది. అయోధ్య స్థల వివాదంలో భూమి రాముడికే చెందుతుందని సుప్రీంకోర్టు తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే. అయోధ్యలోని రామజన్మభూమి-బాబ్రీ మసీదు స్థల వివాదం కేసు తీర్పును సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్ చదివి వినిపించారు. ఇందులో భాగంగా అయోధ్యలోని వివాదాస్పద స్థలాన్ని పంచుకోవాలంటూ గతంలో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు తప్పుబట్టింది. వివాదాస్పద స్థలాన్ని పంచే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. సుప్రీం తీర్పుతో అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి మార్గం సుగమమైంది. అయోధ్యలోనే మసీదు నిర్మాణానికి ముస్లింలకు ప్రత్యామ్నాయంగా ఐదు ఎకరాల స్థలం కేటాయించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.