(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
తెలంగాణలో హుజూర్ నగర్ ఉప ఎన్నికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానం నుంచి సర్పంచులు కూడా బరిలో దిగనున్నారు. దీంతో హుజూర్ నగర్ పై అందరి దృష్టి పడింది. ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ ఈ ఉపఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మావతి రెడ్డి, టీఆర్ఎస్ అభ్యర్థిగా శానంపూడి సైదిరెడ్డి పోటీలో ఉన్నారు. అయితే, సర్పంచుల పట్ల తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుకు నిరసనగా హుజూర్ నగర్ ఉప ఎన్నికలో 251 మంది సర్పంచులు నామినేషన్లు వేయనున్నారు. ఈ మేరకు ఇప్పటికే రాష్ట్ర సర్పంచుల సంఘం ప్రకటించింది. ప్రధాన పార్టీలకు పోటీగా ఉపఎన్నిక బరిలోకి దిగబోతున్నారు. దీంతో హుజూర్ నగర్ ఉపఎన్నిక ప్రాధాన్యత సంతరించుకుంది.
గత సార్వత్రిక ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి పెద్ద ఎత్తున పసుపు రైతులు ఎన్నికల్లో పోటీ చేసిన విషయం తెలిసిందే. పసుపు బోర్డు ఏర్పాటుతో పాటు పసుపు, ఎర్రజొన్న పంటలకు మద్దతు ధర పెంపు కోసం నిజామాబాద్ లోక్సభ స్థానం నుంచి 236 మంది రైతులు నామినేషన్లు వేశారు. దీంతో నిజామాబాద్ నియోజకవర్గం దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ కుమార్తె, సిట్టింగ్ ఎంపీ కవిత ఓటమిపాలయ్యారు. నిజామాబాద్ ఎంపీగా బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ గెలిపొందారు. తాజాగా హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో 251 మంది సర్పంచ్ లు బరిలో దిగడంతో రాజకీయం మరింత వేడెక్కింది. హుజూర్ నగర్ లో కూడా నిజామాబాద్ తరహా ఫలితాలే మళ్లీ వస్తాయా? అన్న చర్చ సర్వత్ర జరుగుతోంది. హుజూర్ నగర్ లో అక్టోబర్ 21 పోలింగ్, 24న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
2018 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్ నగర్ నియోజకవర్గం నుంచి 17మంది పోటీ చేశారు. అయితే, ఈ స్థానం నుంచి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలుపొందారు. ఏప్రిల్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆయన నల్గొండ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి లోక్సభకు ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలో హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేయడంతో అక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. టీపీసీసీ చీఫ్ పోటీ చేసి గెలుపొందిన స్థానం కావడంతో హుజూర్ నగర్ను ఎలాగైనా మళ్లీ దక్కించుకోవాలనే కసితో కాంగ్రెస్ ఉంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ ఇప్పటికే ప్రచారాన్ని ముమ్మరం చేశారు. 30 వేల మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ గెలుపొందడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక అధికార టీఆర్ఎస్ పార్టీ గతంలో పోటీ చేసిన శానంపూడి సైదిరెడ్డినే అభ్యర్థిగా బరిలోకి దింపింది. ఈ సారి విజయం తమదే అని గులాబీ నేతలు అంటున్నారు.
మరోవైపు హుజూర్ నగర్ ఉప ఎన్నిక అభ్యర్థిపై బీజేపీ సుదీర్ఘంగా చర్చిస్తోంది. శ్రీకళారెడ్డి ఎంపిక దాదాపు ఖరారైనట్టుగా తెలుస్తోంది. ఇక తెలంగాణ టీడీపీ హుజుర్ నగర్ ఉప ఎన్నికలో పాల్గొంటుందా లేదా అనే విషయంపై ఇంతవరకు స్పష్టత ఇవ్వలేదు. హుజుర్ నగర్ ఎన్నికను టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మూడు పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. సర్వ శక్తులు ఒడ్డయినా ఎలాగైనా గెలవాలని చూస్తున్నాయి. దీనితో ఇప్పుడు సర్పంచులు కూడా ఉప ఎన్నికల బరిలో ఉండటంతో ఈ ఎన్నిక చాలా రసవత్తరంగా ఉండబోతోంది. అయితే, ప్రజా తీర్పు ఎవరి పక్షాన ఉంటుందనేది ఎన్నికల ఫలితాలు వచ్చే వరకూ ఆగాల్సిందే.