ముంబై: మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని తామే ఏర్పాటు చేస్తామని శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రకటించాయి. ఈ మేరకు తమ పార్టీల ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన మద్దతు లేఖలను ఈ పార్టీలు గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీకి సమర్పించాయి. సోమవారం ఉదయం మూడు పార్టీలకు చెందిన నేతలు ఏక్ నాథ్ షిండే, అశోక్ చవాన్, జయంత్ పాటిల్ రాజ్ భవన్ కు వెళ్లారు. తమ 54 మంది ఎమ్మెల్యేలలో 51 మంది సంతకాలను ఎన్సీపీ అందజేయగా.. శివసేన తమ 63 మంది, కాంగ్రెస్ 44 మంది సభ్యుల మద్దతు లేఖలను సమర్పించాయి. సమాజ్ వాదీ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల మద్దతు లేఖలు కూడా గవర్నర్ కు అందాయి. 288 మంది సభ్యులున్న అసెంబ్లీలో తమకు 162 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని ఈ మూడు ప్రధాన పార్టీలు తెలిపాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సత్తా తమకే ఉందని ఈ పార్టీలు పేర్కొంటున్నాయి.
మహారాష్ట్ర అసెంబ్లీలో బీజేపీ వెంటనే బలపరీక్ష ఎదుర్కొనేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు దాఖలు చేసిన పిటిషన్ పై ఇరు పక్షాల వాదానలు విన్న సుప్రీం కోర్టు.. తన తీర్పును రిజర్వ్లో పెట్టింది. మంగళవారం ఉదయం 10.30 గంటలకు తీర్పును ప్రకటించనుంది. తొలుత 24 గంటల్లోగా అసెంబ్లీలో బలపరీక్షను నిరూపించుకోవాల్సిందిగా బీజేపీని ఆదేశించిన కోర్టు.. ఆ తర్వాత తీర్పును రిజర్వ్లో ఉంచుతున్నట్లు ప్రకటించింది.
మొత్తం 288 మంది సభ్యులున్న మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు మ్యాజిక్ ఫిగర్ 145 మంది. బీజేపీకి 105, శివసేనకు 56, ఎన్సీపీకి 54, కాంగ్రెస్ కి 44మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మెజారిటీ సాధించడానికి బీజేపీ అన్ని దారులు వెతుకుతోంది. 170 ఎమ్మెల్యేల మద్దతు లక్ష్యంగా పెట్టుకుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాత్రికి రాత్రి మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన ఎత్తివేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బీజేపీ-అజిత్ పవార్ మద్దతుదారులతో ప్రభుత్వం ఏర్పాటైంది. అయితే ప్రభుత్వం ఏర్పాటుకి సంబంధించి సంఖ్యా బలం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.