(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
న్యూఢిల్లీ: మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం బలపరీక్షపై మంగళవారం ఉదయం 10:30 గంటలకు ఉత్తర్వులు ఇస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. గంట 20 నిముషాల సేపు ఇరు వైపులా వాదనలు విన్న తర్వాత జస్టిస్ ఎన్వి రమణ నేతృత్వంలో జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ సంజీవ్ ఖన్నా సభ్యులుగా ఉన్న త్రిసభ్య ధర్మాసనం తీర్పు రేపటికి వాయిదా వేసింది.
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన దేవేంద్ర ఫడ్నవీస్ విశ్వాస పరీక్షకు ఎప్పుడు నిలవాలన్న అంశంపై , విశ్వాసపరీక్షకు సభ సమావేశమయినపుడు అనుసరించాల్సిన విధానంపై సుప్రీంకోర్టులో ప్రధానంగా వాదనలు జరిగాయి. ఫలానా సమయంలోగా బలనిరూపణ చేయాలంటూ ముఖ్యమంత్రిని ఆదేశించాల్సిందిగా గవర్నర్ను కోరడం చట్టవిరుద్ధమని ఫడ్నవీస్, బిజెపి తరపు హాజరయిన సీనియర్ అడ్వొకేట్ ముకుల్ రోహత్గీ వాదించారు. అలాంటి రూలింగ్ ఇస్తే భవిష్యత్తులో ఇతర ప్రభుత్వాల ఏర్పాటుపై దాని ప్రభావం ఉంటుందని ఆయన అన్నారు. ఆర్టికల్ 361 కింద గవర్నర్ చర్యలను ఎవరూ ప్రశ్నించలేరని ఆయన వాదించారు.
శివసేన – ఎన్సిపి – కాంగ్రెస్ దాఖలు చేసిన పిటిషన్పై ఆదివారం అత్యవసరంగా విచారణ జరుపుతూ సుప్రీంకోర్టు త్రిసభ్యధర్మాసనం కోరిన విధంగా కేంద్రప్రభుత్వం సోమవారం నాడు బెంచ్కు రెండు లేఖలు అందించింది. ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరుతూ గవర్నర్ భగత్ సింగ్ కోషియారీకి ఫడ్నవీస్ ఇచ్చిన లేఖనూ, ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా ఫడ్నవీస్ను కోరుతూ గవర్నర్ జారీ చేసిన లేఖనూ ధర్మాసనం పరిశీలించింది.
తమకు 170 మంది శాసనసభ్యుల మద్దతు ఉందని రోహత్గీ పేర్కొన్నారు. శివసేన ఎన్సిపి కాంగ్రెస్ కలిసి తమకు 154 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని పేర్కొన్నారు. 154 మంది శాసనసభ్యుల మద్దతు ఉందంటూ వారి సంతకాలతో దాఖలు చేసిన తాజా అఫిడవిట్ను ఉపసంహరించుకోవాల్సిందిగా సుప్రీంకోర్టు ఆ పార్టీల తరపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీని కోరింది. అవతలి పక్షానికి కాపీ ఇవ్వకుండా కోర్టులో ఏదీ దాఖలు చేయారాదని కోర్టు పేర్కొన్నది.
శాసనసభలో విశ్వాసపరీక్ష జరిగి తాము అందులో పరాజయం పాలయితే సంతోషంగా స్వీకరిస్తామనీ, బిజెపి – అజిత్ పవార్కు బలం ఉంట్ విశ్వాసపరీక్షకు ఎందుకు వెనుకాడుతున్నారనీ మను సింఘ్వీ పేర్కొన్నారు. ఒక్క ఎన్సిపి శాసనసభ్యుడు కూడా బిజెపికు అనుకులంగా లేఖ ఇవ్వలేదనీ, బిజిపి అజిత్ పవార్ కలిసి ప్రజాస్వామ్యాన్ని వంచించారని సింఘ్వీ పేర్కొన్నారు.
మరో సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ వాదిస్తూ 24 గంటల్లోగా విశ్వాసపరీక్ష జరగాలని పేర్కొన్నారు. కొంప మునిగిపోయినట్లు రాష్ట్రపతి పాలన రద్దు చేయడం, హడావుడిగా ప్రమాణస్వీకారం చేయించడం గతంలో ఎన్నడూ జరగలేదని ఆయన అన్నారు.
విశ్వాస పరీక్షకు అసెంబ్లీ సమావేశమైతే మొదట స్పీకర్ ఎన్నిక జరగలా వద్దా అన్న విషయంలో కూడా వాదనలు జరిగాయి. విశ్వాసపరీక్ష ఒక్కటే ఎజెండాలో ఉండాలనీ, స్పీకర్ ఎన్నిక జరగరాదనీ కాంగ్రెస్ – సేన – ఎన్సిపి వాదించింది. ప్రోటెం స్పీకర్ ఎన్నిక మొదట జరగాలనీ, తర్వాత సభ్యుల ప్రమాణస్వీకారం జరగాలనీ, అనంతరం స్పీకర్ ఎన్నిక జరగాలని బిజెపి వాదించింది. ఆ తర్వాత మాత్రమే విశ్వాసపరీక్ష ఉండాలని బిజెపి పేర్కొన్నది. అలా కుదరదనీ, ప్రొటెం స్పీకర్ ఎన్నిక జరిగిన వెంటనే విశ్వాసపరీక్ష జరగాలనీ మనుసింఘ్వీ వాదించారు.