హైదరాబాద్: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికార, విపక్ష పార్టీలు ఘనంగా జరుపుకున్నాయి. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులు జాతీయ జెండాను ఎగురవేశారు. తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జాతీయ జెండాను ఎగురవేశారు. భారత యూనియన్లో హైదరాబాద్ సంస్థానం విలీనం అయిన నేడు.. ఆనాటి పోరాటంలో అసమాన త్యాగాలు చేసిన వీరులను స్మరించుకుందాం.. జై తెలంగాణ, జై హింద్ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.
Sept 17th: The day Hyderabad was merged with Indian Union – Remembering the countless sacrfices & saluting the martyrs. Jai Telangana, Jai Hind?
హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్ లో విలీనం అయిన నేడు. ఆనాటి పోరాటంలో అసమాన త్యాగాలు చేసిన వీరులను స్మరించుకుందాం. జై తెలంగాణ, జై హింద్ pic.twitter.com/femoEACtkt
— KTR (@KTRTRS) September 17, 2019
అటు గాంధీభవన్లోను విలీన దినోత్సవాన్ని నిర్వహించారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి జాతీయ జెండా ఎగురేశారు. స్వాతంత్ర్య సమరయోధులను ఉత్తమ్ సన్మానించారు. అనంతరం ఉత్తమ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్, కమ్యూనిస్టులు నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేశారన్నారు. ఖాశీంరజ్వీ అరాచకాలకు వ్యతిరేకంగా పోరాటం జరిగిందన్నారు. సర్దార్ పటేల్ చొరవతో భారత్లో హైదరాబాద్ విలీనమైందని ఉత్తమ్ పేర్కొన్నారు. అయితే బీజేపీ దీనికి మతం రంగు పూసే ప్రయత్నం చేసిందని, హైదరాబాద్ విలీనానికి మతంతో సంబంధం లేదని ఉత్తమ్ స్పష్టం చేశారు.
1947 ఆగష్టు 15న భారతవనికి స్వాతంత్ర్యం వచ్చింది. కానీ హైదరాబాద్ సంస్థానం మాత్రం నిజాం నవాబు పాలనలోనే ఉండిపోయింది. బ్రిటిషర్లకు సామంతుడిగా ఉన్న ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ స్వతంత్రంగా ఉండటానికి మొగ్గు చూపాడు. హైదరాబాద్ ప్రాంత ప్రజలు భారత్లో కలవడానికి మొగ్గు చూపినా.. నిజాం నవాబు మాత్రం అందుకు అంగీకరించలేదు. నిజాం పాలనలో రజాకర్లు చెలరేగిపోయారు. అప్పట్లో రాజాకార్ల పేరుతో ప్రత్యేక సైన్యాన్ని తయారుచేసిన ఖాసిం రజ్వీ… మారణకాండకు తెగబడ్డారు. స్వాతంత్ర్యం వచ్చాక దాదాపు 13 నెలలపాటూ… తెలంగాణ ప్రజలు చూడని నరకం లేదు. సామాన్య ప్రజానీకంపై వీరి అరాచకాలు సాగాయి. గ్రామాలపై పడి ఆస్తులను దోచుకున్నారు. హత్యాకాండను సాగించారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా స్టేట్ కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీ, ఆర్యసమాజ్ పోరాటాన్ని ప్రారంభించాయి. ఈ సంస్థలన్నింటినీ ఉస్మాన్ అలీఖాన్ నిషేధించాడు. దేశం మధ్యలో ఉన్న సువిశాల ప్రాంతం భారత యూనియన్లో చేరకపోతే.. అది దేశ మనుగడకే ముప్పు. దీంతో హైదరాబాద్ సంస్థానంపై సైనిక చర్యకు దిగాలని నాటి హోం మంత్రి సర్దార్ వల్లభభాయ్ పటేల్ నిర్ణయించారు.
నిజాం నవాబుతో చర్చల ద్వారా ఈ సమస్యని పరిష్కరించుకొందామని భారత తొలి ప్రధాని నెహ్రూ అనుకొన్నారు. కానీ సైనికచర్య ద్వారా వెంటనే నిజాం సంస్థానాన్ని స్వాధీనం చేసుకొని భారత్ లో విలీనం చేసి రజాకర్లని అరికట్టడం అత్యవసరం అని ఆనాటి హోం మంత్రి సర్దార్ వల్లభ భాయ్ పటేల్ పట్టుబట్టి నెహ్రూని ఒప్పించారు. భారత ప్రభుత్వం తమపైకి యుద్దానికి సిద్దం అవుతోందని తెలిసిన నిజాం నవాబు ఉస్మాన్ అలీ ఖాన్ ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా అందుకు తాము కూడా సిద్దమేనని ప్రకటించడంతో భారత-నిజాం సేనల మద్య యుద్ధం అనివార్యం అయ్యింది. 1948 సెప్టెంబరు 13న భారత సైన్యం ‘ఆపరేషన్ పోలో‘ పేరిట హైదరాబాద్ సంస్థానాన్ని ముట్టడించింది. భారత సైన్యం ముందు రజాకార్లు, నిజాం సైన్యం ఎదురు నిలవలేకపోయింది. సెప్టెంబర్ 17న సాయంత్రం సుమారు 5 గంటల సమయానికల్లా భారత ఆర్మీ హైదరాబాద్ను పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకుంది. అనంతరం నిజాం నవాబు భారత ప్రభుత్వానికి లొంగిపోతున్నట్టు రేడియో ద్వారా ప్రకటించాడు. అలా ఆపరేషన్ పోలో పూర్తయ్యింది. అప్పటి నుంచి సెప్టెంబరు 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా పాటిస్తారు.
ఈ నేపథ్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని విపక్షాలు కోరుతున్నాయి. కానీ అధికార టీఆర్ఎస్ ప్రభుత్వం… అందుకు ససేమిరా అంటోంది. మజ్లిస్ పార్టీతో పొత్తు పెట్టుకున్న కారణం వల్లే టీఆర్ఎస్ వెనకడుకు వేస్తోందన్నది ప్రతిపక్షాల ఆరోపిస్తున్నాయి. అయితే దీనిపై ఇటీవలే సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలకు అసలైన విముక్తి.. విమోచనం.. 2014 జూన్ 2 అని స్పష్టం చేశారు. సెప్టెంబర్ 17న ఎవరికి నచ్చింది వాళ్లు చేసుకోవచ్చునని.. అలాగని శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక సెప్టెంబర్ 17ని అధికారికంగా నిర్వహించాలని భావించిన మాట నిజమేనని.. కానీ అన్నీ వర్గాలను దృష్టిలో పెట్టుకుని.. గతాన్ని మళ్లీ తవ్వడమెందుకన్న ఉద్దేశంతో ఆరోజు ఎలాంటి దినోత్సవాన్ని జరపడం లేదన్నారు.
కొంతమంది సెప్టెంబర్ 17 రాగానే హడావుడి చేస్తున్నారని ఎద్దేవా చేశారు. నిజాంపై నిందలు వేసే బీజేపీ.. మరి సర్దార్ పటేలే స్వయంగా ఆయనకు రాజ్ ప్రముఖ్ బిరుదు ఇచ్చిన విషయం గురించి ఎందుకు మాట్లాడదని ప్రశ్నించారు. సెప్టెంబర్ 17 హిందువులకో.. ముస్లింలకో సంబంధించింది కాదన్నారు. ఇప్పటి సమాజానికి దానితో అవసరం లేదు కాబట్టే దాన్ని పక్కనపెట్టేశామన్నారు. ఎవరైనా రెచ్చగొట్టే రీతిలో వ్యవహరిస్తే అణచివేస్తామని.. శాంతిభద్రతలను కాపాడటమే తమ ప్రాధాన్యం అని కేసీఆర్ చెప్పారు.