(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజీనామా ఎపిసోడ్ రాజకీయంగా పెద్ద చర్చనీయాంశం అయింది. వంశీ రాజీనామా ప్రస్తుతం ఓ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తూ ఎన్నో మలుపులు తిరుగుతోంది. ఆయన వైసీపీలోకి వెళ్తారా ? లేదా బాబు బుజ్జగింపులతో తిరిగి టీడీపీలోనే ఉంటారా ? లేదా బీజేపీలోకి వెళ్తారా? లేక పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటారా అన్నది సస్పెన్స్ గా మారింది. తాను రాజకీయాలు వీడు తున్నానంటూ రెండు రోజుల క్రితం తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన వల్లభనేని వంశీ.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు. తనను, తన క్యాడర్ను వైఎస్సార్సీపీ నేతలు, ప్రభుత్వ అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆయన లేఖలో పేర్కొన్నారు. రాజకీయాలకు కూడా దూరంగా ఉండాలని నిర్ణయించినట్లు బాబుకు రాసిన లేఖలో నిశితంగా వివరించారు. అయితే, వంశీ వైసీపీలో చేరడం ఖాయమన్న ప్రచారమూ పెద్దఎత్తున జరుగుతోంది. రెండు రోజుల క్రితం వంశీ సీఎం జగన్ని కలిశారు. ఆ సమయంలో.. కలిసి పనిచేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని జగన్ వద్ద వంశీ ప్రతిపాదించగా, ఆయన సానుకూలంగా స్పందించారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.
వైసీపీ వేధిస్తే.. ఆపార్టీలో ఎలా చేరుతారని టీడీపీ నేత బొండా ఉమా ప్రశ్నించారు. వంశీ పార్టీ మారాలనుకుంటే మీడియా ముందుకు వచ్చి చెప్పి.. స్పష్టంగా రాజీనామా లేఖ ఇవ్వాలి అన్నారు బోండా. దీంతో వంశీ ఏం నిర్ణయం తీసుకోబోతున్నారన్న అంశంపై అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. వంశీ వ్యవహారానికి సామరస్యపూర్వక ముగింపు పలికేందుకు విజయవాడ ఎంపీ కేశినేని నాని, బందరు మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణను పార్టీ అధిష్ఠానం సోమవారం రంగంలోకి దింపింది. అయితే వంశీ హైదరాబాద్లో ఉండటంతో వీరు చర్చలు జరపలేకపోయారు. అయితే ఫోన్లో నారాయణతో వంశీ టచ్లోకి వచ్చారు. చర్చలకు తాను సిద్ధమేనని ఈ సందర్భంగా వంశీ స్పష్టం చేసినట్లు తెలిసింది. మంగళవారం నారాయణ, నానిలతో వంశీ భేటీ అయ్యే అవకాశముంది. వంశీ తన నిర్ణయం ఏమిటో స్పష్టం చేసేవరకు ఆయనకు వ్యతిరేకంగా పార్టీ నాయకులు ఎవ్వరూ మాట్లాడవద్దని టీడీపీ అధిష్ఠానం తమ నేతలకు స్పష్టం చేసింది. టీడీపీ ప్రయత్నాలు ఇలా ఉండగా మరోవైపు వంశీ వైసీపీలో చేరడం ఖాయమన్న ప్రచారమూ పెద్దఎత్తున జరుగుతోంది.
ఒకటి రెండు రోజుల్లో సీఎం జగన్ సమక్షంలో వంశీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని ప్రచారం జరుగుతోంది. ఒకవైపు ఆయన పార్టీ మార్పును నిలువరించేందుకు తెలుగుదేశం నేతలు ప్రయత్నిస్తున్నా వంశీ మాత్రం అంగీకరించడం లేదని తెలుస్తోంది. మరోవైపు వంశీ రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న గన్నవరం వైసీపీ ఇన్ చార్జ్ యార్లగడ్డ వెంకట్రావు, తన మనసులోని మాటను జగన్ తో చెప్పేందుకు ప్రయత్నించినా, ఆయన అపాయింట్ మెంట్ లభించలేదు. దీంతో జగన్ నివాసానికి వెళ్లి చాలాసేపు నిరీక్షించిన యార్లగడ్డ నిరాశతో వెనుతిరిగారు. వంశీ రాజీనామా చేసిన తరువాతనే వైసీపీలోకి వచ్చేందుకు నిర్ణయించుకోవడంతో ఉప ఎన్నికలు వస్తే, ఇండిపెండెంట్ అభ్యర్థిగానైనా పోటీకి దిగాలని యార్లగడ్డ భావిస్తున్నట్టు తెలుస్తోంది.
తనను నమ్ముకున్న వారిని కాపాడుకునేందుకే పార్టీకి, శాసన సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇటీవల ఆయన బీజేపీ ఎంపీ సుజనా చౌదరిని కలిసి పార్టీ మార్పుపై చర్చించారు. బీజేపీలో చేరితే తనపై ఉన్న కేసుల నుంచి ఉపశమనం లభించే అవకాశాలు లేకపోవడంతో పునరాలోచనలో పడ్డారన్న ప్రచారం సాగింది. ఒకవేళ చేరినా ఎమ్మెల్యేగా అనర్హత వేటు పడుతుంది. తర్వాత ఉప ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసినా విజయావకాశాలు లేకపోవడంతో వంశీ చూపు అధికార వైఎస్సార్సీపీ వైపు మళ్లినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వైసీపీ నేతలు, కొంత మంది అధికారులు తనను పార్టీ కార్యకర్తలను వేధిస్తున్నారని అక్రమ కేసులు బనాయిస్తున్నారని చంద్రబాబుకు రాసిన లేఖలో వంశీ పేర్కొనడం పట్ల వైసీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. తమను ఓవైపు విమర్శిస్తూనే మరో వైపు తమ పార్టీలోకి వచ్చేందుకు ఎలా ప్రయత్నాలు చేస్తున్నారని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో వంశీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై అటు టీడీపీ శ్రేణులతోపాటు ఇటు వైసీపీ శ్రేణుల్లోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది.