కేంద్ర ముసాయిదాపై నిరసనల వెల్లువ
చెన్నై: పాఠశాలల్లో హిందీని మూడోభాషగా తప్పనిసరి చేయకూడదంటూ సోషల్ మీడియాలో ప్రచారం వెల్లువెత్తుతోంది. కేంద్ర ప్రభుత్వానికి తాజాగా విద్యావిధాన ముసాయిదా అందిన నేపథ్యంలో ఈ నిరసనలు మొదలయ్యాయి. ముఖ్యంగా తమిళనాడులో హిందీవ్యతిరేక ఉద్యమాలు చాలా కాలంగా కొనసాగుతున్న నేపథ్యంలో అక్కడి నాయకులు ఇస్రో మాజీ చీఫ్ కృష్ణస్వామి కస్తూరి రంగన్ చేసిన సిఫార్సులపై మండిపడుతున్నారు.
1968 నుంచి కొన్ని స్కూళ్లలో మూడు భాషల విధానాన్ని అమలుచేస్తున్నారని.. దాన్ని కొనసాగించాలని 2019 జాతీయ విద్యావిధానం ముసాయిదాలో చెప్పారు. ప్రాథమిక విద్య నుంచే ఈ మూడుభాషల విధానం ఉండాలన్నారు. హిందీని ఎనిమిదో తరగతి వరకు తప్పనిసరి చేయాలన్న ప్రయత్నాల్లో భాగంగానే ఈ సిఫార్సులు ఇచ్చారని చాలామంది విమర్శిస్తున్నారు. దాంతో హిందీని తమపై రుద్దొద్దంటూ తమిళనాడులోని ట్విట్టర్ యూజర్లు మోతెక్కిస్తున్నారు. దీనికి సంబంధించిన హ్యాష్ ట్యాగ్ లు అప్పుడే ట్రెండింగ్ లోకి వచ్చేశాయి.
దక్షిణ భారతంలో వెల్లువెత్తిన నిరసన చూసి కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ స్పందించారు. ఇది కేవలం ఒక నివేదిక మాత్రమే తప్ప.. ఇంకా విధానంగా తీసుకోలేదని తెలిపారు. ‘‘ఇదింకా విధానం కాదు. ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటాం. ఇది విధానం అయిపోయిందని తప్పుగా అర్థం చేసుకున్నారు. ఏ రాష్ట్రంపైనా ఏ భాషనూ రుద్దబోము’’ అని చెప్పారు. ఈ కొత్త విధానాన్ని చట్టరూపంలో తెచ్చినా తమిళనాడులో మాత్రం దాన్ని కొట్టి పారేస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కేఏ సెంగొట్టియన్ చెప్పారు. తమిళనాడులో కేవలం తమిళం, ఇంగ్లిషు మాత్రమే బోధిస్తారని ఆయన స్పష్టం చేశారు. అన్నాడీఎంకే మాత్రం ప్రస్తుతం కేంద్రంలో బీజేపీకి మిత్రపక్షంగా ఉంది.
మరోవైపు ప్రతిపక్షం కూడా దీనిపై స్పందించింది. బీజేపీ ఇలాంటి చర్యలు తీసుకుంటే వారికి భారీ ఎదురుదెబ్బ తప్పదని డీఎంకే నాయకుడు ఎంకే స్టాలిన్ హెచ్చరించారు. ఇలాగైతే భాషాయుద్ధం జరుగుతుందని ఎండీఎంకే నేత వైగో అన్నారు. హిందీ మాట్లాడని రాష్ట్రాలపై హిందీని రుద్దాలనుకోవడం సమాఖ్య వ్యవస్థను దెబ్బతీస్తుందని, దీనివల్ల హిందీ మాట్లాడని వాళ్లు రెండోతరగతి పౌరులవుతారని ఏఎంఎంకే నాయకుడు టీటీవీ దినకరన్ చెప్పారు. తాను హిందీ సినిమాల్లో నటించానని.. కానీ ఏ ఒక్కరూ దేన్నీ ఎవరిమీదా రుద్దకూడదని, ఏ భాష నేర్చుకోవాలన్నది వ్యక్తుల ఇష్టమని కమల్ హాసన్ అన్నారు.