ఢిల్లీ: రఫేల్ యుద్ద విమానాల కొనుగోలు అంశంపై సుప్రీంకోర్టులో కేంద్రానికి ఎదురుదెబ్బ తగిలింది. రఫేల్ తీర్పును పునః సమీక్షించాలంటూ దాఖలైన రివ్యూ పిటిషన్లపై కేంద్రం లేవనెత్తిన ప్రాథమిక అభ్యంతరాలను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. రివ్యూ పిటిషనర్లు దాఖలు చేసిన పత్రాల మెరిట్ ఆధారంగా కేసు విచారణ జరుపుతామని కోర్టు స్పష్టం చేసింది. విచారణ తేదీని త్వరలోనే నిర్ణయిస్తామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ధర్మాసనం వెల్లడించింది.
రఫేల్ ఒప్పందంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని కేంద్ర ప్రభుత్వానికి క్లీన్చిట్ ఇస్తూ గత ఏడాది డిసెంబరు 14న సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది. ఆ సమయంలో ఒప్పందాన్ని సవాల్ చేస్తూ దాఖలైన అన్ని పిటిషన్లను న్యాయస్థానం కొట్టివేసింది. అయితే ఈ తీర్పుపై మరోసారి సమీక్ష జరపాలని కోరుతూ ప్రశాంత్ భూషణ్, అరుణ్ శౌరీ, యశ్వంత్ సిన్హాలు న్యాయస్థానంలో రివ్యూ పిటిషన్లు దాఖలు చేశారు.
దొంగిలించిన పత్రాలను సాక్షాలుగా చూపుతూ పిటిషనర్లు కేసు వాదించడాన్ని అడ్వకేట్ జనరల్ వ్యతిరేకించారు. అలాగే ప్రభుత్వం గతంలో ఇదే కేసుకు సంబంధించి దాఖలు చేసిన అఫిడవిట్లో పలు దోషాలు ఉన్నాయనీ, వాటిని సరి చేసి ఆదేశాలు ఇవ్వాలని ప్రభుత్వం వాదించింది. దొంగిలించిన పత్రాలైనా సరే కేసుకు ఉపయోగపడతాయని భావిస్తే వాటిని పరిగణలోకి తీసుకోవడంలో తప్పులేదని న్యాయమూర్తి గత విచారణ సమయంలో వ్యాఖ్యానించారు.