(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
న్యూఢిల్లీ: కడుపున పుట్టిన మూడేళ్ల పసికందును కళ్ల ముందే బండ కేసి కొట్టి చంపారు. తనను సామూహికంగా మానభంగం చేశారు. చూస్తుండగానే కుటుంబసభ్యులను ఒక్కొక్కరుగా 14 మందిని దారుణంగా హతమార్చారు. ఇది బిల్కిస్ బానో కథ. అప్పుడు ఆమె వయసు 19 ఏళ్లు. అయిదు నెలల గర్భవతి కూడా. న్యాయం కోసం ఆమె 17 ఏళ్లు కోర్టుల చుట్టూ తిరిగింది.
అలాంటి నిర్భాగ్యురాలికి నష్టపరిహారం ఇచ్చేందుకు గుజరాత్లోని బిజెపి ప్రభుత్వం వెనుకాడుతోంది. అది కూడా సుప్రీంకోర్టు ఆదేశించిన తర్వాత. 2002 మార్చిలో బిల్కిస్ బానో జీవితాన్ని ఛిద్రం చేసిన గోధ్రా అనంతర మారణకాండ జరిగినపుడు నేటి ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం గుజరాత్ను ఏలుతోంది. ఇప్పుడు విజయ్ రూపానీ నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వం రాజ్యం చేస్తోంది.
తనను మానభంగం చేసి తన కుటుంబసభ్యులందరినీ హతమార్చిన మరుసటి రోజునే బిల్కిస్ బానో పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే మెజిస్ట్రేట్ సాక్ష్యం లేదంటూ కేసు మూసివేశారు. తర్వాత బానో కథ అనేక మలుపులు తిరిగి కేసు సిబిఐ చేతుల్లోకి వెళ్లింది. ట్రయిల్ కోర్టులో నిందితుల తరపు న్యాయవాదులు బానోను 20 రోజుల పాటు క్రాస్ ఎగ్జామిన్ చేశారు. చివరికి నిందితులకు శిక్షలు పడ్డాయి.
గత ఏప్రిల్ 23న ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం బిల్కిస్ బానోకు పరిహారం ఆవార్డు చేసింది. ఆమెకు 50 లక్షల రూపాయల పరిహారం అందించాలనీ, ఒక నివాసగృహం ఇవ్వాలనీ, ఉద్యోగం చూపించాలనీ న్యాయస్థానం గుజరాత్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆదేశాలు జారీ చేసి దాదాపు 5 నెలలు గడిచినప్పటికీ ఇంకా అవి అమలుకు నోచుకోని విషయం మొన్న సోమవారం ధర్మాసనం దృష్టికి వచ్చింది
గుజరాత్ తరపున కోర్టులో హాజరయిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ప్రధాన న్యాయమూర్తి నిలదీశారు. గుజరాత్ ప్రభుత్వం రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలనుకుంటోందని మెహతా చెప్పారు. దానికి జస్టిస్ గొగోయ్ అంగీకరించలేదు. ఏప్రిల్లో ఇచ్చిందే తుదితీర్పు అనీ, దానిని అమలు చేయాల్సిందేననీ ఆయన స్పష్టం చేశారు.
గత ఏప్రిల్లో ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశాలు ఇచ్చినపుడు బిల్కిస్ బానో కేసు ప్రత్యేకమైనదని పేర్కొన్నది. ‘ఆమెను 22 సార్లు రేప్ చేశారు. మూడేళ్ల కుమార్తెను బండకేసి కొట్టి చంపారు. అప్పటినుంచీ ఆమె స్వచ్ఛందసంస్థల దయాధర్మాలపై ఆధారపడి సంచార జీవనం గడుపుతోంది. ఇప్పుడు ఆమెకు 40 ఏళ్లు. పెద్ద చదువులు చదవలేదు. కుటుంబం మొత్తాన్నీ కోల్పోయింది. ఈ బాధితురాలికి తగిన పరిహారం నిర్ణయించేందుకు ఖచ్చితమైన నిబంధనలకోసం వెతకక్కర లేదు’ అని ధర్మాసనం పేర్కొన్నది.
అయినప్పటికీ గుజరాత్ ప్రభుత్వం పరిహారం విషయంలో రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయించింది. పునసమీక్షకు అవకాశం లేదన్న ప్రధాన న్యాయమూర్తి రెండు వారాల్లోగా బిల్కిస్ బానోకు పరిహారం చెల్లించాలనీ, ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలనీ ఆదేశించారు.