న్యూఢిల్లీ: రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై విచారణకు నిరాకరిస్తూ ఇచ్చిన తీర్పును మార్చాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రఫేల్ యుద్ధవిమానాల కొనుగోలు ఒప్పందంలో అవినీతి చోటు చేసుకుందన్న అభియోగాలపై సిబిఐ విచారణకు ఆదేశించాలన్న పిటిషన్లను గత సంవత్సరం డిసెంబర్ 14న సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ ఒప్పందం విషయంలో ప్రభుత్వం నిజాయతీని శంకించాల్సిన అవసరం లేదని కోర్టు పేర్కొన్నది.
ఆ తీర్పు సమీక్ష కోరుతూ దాఖలయిన పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు గత మే నెలలో తీర్పు వాయిదా వేసింది. ప్రధాన న్యాయముర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం గురువారం తీర్పు చెబుతూ, రఫేల్పై సిబిఐ విచారణ అవసరం లేదని పేర్కొన్నది. జస్టిస్ ఎస్కె కౌల్, జస్టిస్ కెఎమ్ జోసఫ్ ధర్మాసనంలో ఉన్నారు.
గత డిసేంబర్ తీర్పు సమీక్ష కోరుతూ దాఖలయిన పిటిషన్లలో మాజీ కేంద్ర మంత్రులు యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరీ, న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వేసిన పిటిషన్ కూడా ఒకటి. కేంద్ర ప్రభుత్వం కోర్టుకు తప్పుడు సమాచారం సమర్పించిందనీ, దానిపై ఆధారపడి కోర్టు తీర్పు చెప్పిందనీ వారు వాదించారు. పిటిషనర్లు దినపత్రికలలో వచ్చిన కథనాల ఆధారంగా రివ్యూ కోరుతున్నారనీ, అది చెల్లదనీ కేంద్రం వాదించింది. చివరికి పిటిషనర్ల వాదనలో పస లేదని పేర్కొంటూ సుప్రీంకోర్టు రివ్యూ పిటిషన్లను తిరస్కరించింది.