హైదరాబాద్: ఉభయ తెలుగురాష్ట్రాల్లో తీవ్ర సంచలనం కల్గించిన తహశీల్దార్ విజయారెడ్డి సజీవ దహనం కేసులో నిందితుడు సురేష్ గురువారం మృతి చెందాడు. విజయారెడ్డిపై పెట్రోల్ పోసి సజీవ దహనం చేసిన సురేష్ వెంటనే తనపైనా పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంగతి తెలిసిందే. కాలిన గాయాలతోనే సురేష్ పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. అనంతరం అతన్ని పోలీసులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. సురేష్కు 65 శాతం కాలిన గాయాలు అయ్యాయి. సురేష్ ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో బుధవారం సురేష్ నుండి పోలీసులు వాంగ్మూలాన్ని రికార్డ్ చేశారు.
కొంత కాలంగా భూ పట్టా కోసం తహశీల్దార్ చుట్టూ తిరిగానని సురేష్ పోలీసులకు తెలిపాడు. విజయారెడ్డి చేసిన అన్యాయం వల్ల తమ కుటుంబం రోడ్డున పడిందని పోలీసుల వద్ద ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ కారణంగానే ఆమెపై కక్ష పెంచుకున్నానని పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో సురేష్ పేర్కొన్నాడు. గురువారం ఉదయం సురేష్ మృతి చెందాడు. అయితే తహశీల్దార్ విజయారెడ్డి దారుణ హత్య కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. నిందితుడు సురేష్ వెనుక ఇంకెవరన్నా ఉన్నారా అనే విషయాలపైనా పోలీసులు ఆరా తీస్తున్నారు.
విజయారెడ్డి హత్య సందర్భంగా తీవ్రంగా గాయపడిన ఆమె కారు డ్రైవర్ గురునాథం కూడా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే