అమరావతి: ఒక్క అవకాశం అంటూ అధికారంలోకి వచ్చిన వైసిపి మూడు నెలల్లో రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టిందని టిడిపి అధినేత చంద్రబాబు విమర్శించారు. అమరావతి కాన్సెప్ట్నే చంపేసే పరిస్థితికి వచ్చారని ఆయన ఆరోపించారు. నూతన ప్రభుత్వం అమరావతిని దెబ్బతీయడంతో ఇక్కడి వారు హైదరాబాద్కు వలసలు వెళ్లిపోతున్నారని చంద్రబాబు అన్నారు.
అమరావతి ప్రాంత రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చారని చంద్రబాబు పేర్కొన్నారు. వారి త్యాగాలను పట్టించుకోకుండా ప్రభుత్వం అవమానిస్తోందని విమర్శించారు.
ఉమ్మడి ఖమ్మంజిల్లా కొత్తగూడెం, అశ్వారావుపేట నుండి వచ్చిన నాయకులతో చంద్రబాబు బుధవారం సమావేశం అయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో టిడిపికి పూర్వ వైభవం తీసుకువస్తామని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. చేసిన అభివృద్ధి శాశ్వతంగా నిలిచి ఉంటుందని చంద్రబాబు అన్నారు.
క్రీడాకారిణి సింధు బాట్మింటన్లో స్వర్ణ పతకం సాధించి మన దేశానికి, రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచిందని చంద్రబాబు కొనియాడారు. నాడు హైదరాబాదులో జాతీయ స్థాయి క్రీడాకారుడు గోపీచంద్కు గచ్చిబౌలిలో శిక్షణా కేంద్రం ఏర్పాటుకు ఐదు ఎకరాల స్థలం ఇచ్చి ప్రోత్సహించామని చంద్రబాబు గుర్తు చేశారు. ఆ శిక్షణా కేంద్రం వల్ల ఎంతో మంది ఆణిముత్యాల్లాంటి క్రీడాకారులు తయారు అవుతున్నారనీ, వీరు రాష్ట్రానికి, దేశానికి పేరు ప్రఖ్యాతులు తీసుకువస్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి టిడిపి హయాంలో వేసిన పునాదే కారణమని చంద్రబాబు గుర్తు చేశారు.