అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు నేటి నుండి మూడు రోజుల పాటు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. హైకోర్టును లేదా రాజధానిని రాయలసీమకు మార్చడానికి చంద్రబాబు అనుకూలంగా ప్రకటన చేస్తేనే చంద్రబాబును కర్నూలు జిల్లాలో అడుగు పెట్టనిస్తామని రాయలసీమ విద్యార్థి సంఘాల జెఎసి ప్రకటించింది. లేకుంటే ఆయన పర్యటనను అడ్డుకుంటామని హెచ్చరించింది.
ఈ నేపథ్యంలో పోలీసులు కర్నూలులో ముందస్తు చర్యలు చేపట్టారు. ఆందోళనకారులను ముందుగానే పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. దీంతో చంద్రబాబు పర్యటన ఎటువంటి నిరసనలు లేకుండా సజావుగా సాగుతుందని భావిస్తున్నారు.
కర్నూలులోని పిజెఆర్ కన్వెన్షన్ హాలులో జరిగే టిడిపి విస్తృత స్థాయి సమావేశంలో చంద్రబాబు పాల్లొంటారు. మధ్యాహ్నం మూడు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకూ జిల్లాలోని ఒక్కో నియోజకవర్గానికి చెందిన పార్టీ ఇన్చార్జిలు, ముఖ్యనేతలతో విడివిడిగా మాట్లాడి వారి అభిప్రాయాలను స్వీకరిస్తారు. తొలి రోజు ఆదోని, మంత్రాలయం, ఎమ్మిగనూరు, డోన్, నందికొక్కూరు నియోజకవర్గాల నేతలతో చంద్రబాబు ముఖాముఖి నిర్వహించనున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు చర్యలు చేపట్టారు.