అమరావతి: పోలవరం ప్రాజెక్టు విషయంలో జగన్మోహనరెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తున్న వైఖరి వల్ల ప్రాజెక్టు వ్యయం పెరగడంతో పాటు నిర్మాణాలకు అవరోధం ఏర్పడుతుందని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్ లోక్సభ ప్రకటించారు. కేంద్ర మంత్రి అభిప్రాయాలను పురస్కరించుకొని టిడిపి ఎమ్మెల్సీ నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ జగన్మోహనరెడ్డివి తుగ్లక్ చర్యలుగా అభివర్ణిస్తూ విమర్శించారు.
‘తుగ్లక్ గారు ఉన్నారా? విన్నారా? పోలవరం టెండర్లు రద్దు చెయ్యడం బాధాకరం, మీ తుగ్లక్ చర్య వల్ల ప్రాజెక్ట్ ఆలస్యం అవుతుంది, ఖర్చు కూడా పెరుగుతుంది అని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ గారు లోక్ సభ లో చెప్పారు’ అని లోకేష్ ట్వీట్ చేశారు.
పోలవరం ప్రాజెక్టులో 2600 కోట్ల రూపాయల అవినీతి జరిగిపోయిందంటూ తల తిక్క లెక్కలు చెబుతుంటే వారిని చూసి జాలి వేస్తుందని లోకేష్ వ్యాఖ్యానించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం ఖర్చు చేసిన ప్రతి రూపాయికి ఒక లెక్క ఉందని లోకేష్ పేర్కొన్నారు.
పోలవరం ప్రాజెక్ట్ అధారిటీ, కేంద్ర జలసంఘం, కేంద్ర జలవనరుల శాఖ, సిడబ్ల్యుసి, కేంద్ర ఆర్థికశాఖ ఆమోదించిన తర్వాతే నాబార్డ్ నిధులు విడుదల చేస్తుందనీ, ఇన్ని కేంద్ర వ్యవస్థలకు కనిపించని అవినీతి జగన్కు మాత్రమే కనిపించిందని లోకేష్ విమర్శించారు.
రివర్స్ టెండరింగ్ అంటే ఆంధ్రుల జీవనాడి పోలవరానికి టెండర్ పెట్టడమని అర్థమయిందని లోకేష్ పేర్కొన్నారు.
డ్యామ్ సేఫ్టీ బిల్లు చర్చ సందర్భంగా పార్లమెంట్లో టిడిపి సభ్యుడు గల్లా జయదేవ్ అడిగిన ప్రశ్నపై కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్ కీలక వ్యాఖ్యలు చేశారు. పోలవరం టెండర్లను రద్దు చేయడం బాధాకరమని పేర్కొన్నారు. టెండర్ల రద్దు ప్రభావం ప్రాజెక్టు నిర్మాణంపై పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
పోలవరం ప్రాజెక్టు రీ టెండరింగ్ వల్ల ఖర్చు పెరుగుతుందనీ, ఎప్పటికి ఈ ప్రాజెక్టు పూర్తవుతుందో చెప్పలేని పరిస్థితి ఏర్పడుతుందని మంత్రి వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం వల్ల ప్రాజెక్టు నిర్మాణానికి అవరోధం కలుగుతుందని ఆయన స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ భాద్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని ఆయన పేర్కొన్నారు.