(న్యూస్ ఆర్బిట్ బ్యూర్)
హుజూర్ నగర్ ఉపఎన్నికలో పోటీకి తెలంగాణ టీడీపీ సిద్ధమైంది. పోటీ అంశంపై గత రెండు రోజులుగా టీ-టీడీపీ నేతలతో పార్టీ అధినేత చంద్రబాబు చర్చించారు. అయితే, ఆ అభ్యర్థి ఎవరన్నది ఇంకా ప్రకటించలేదు. ఈ విషయమై ఈరోజు ఓ ప్రకటన చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. హుజూర్ నగర్ ఉపఎన్నికలో పోటీ చేయనున్న అభ్యర్థులను ప్రధాన పార్టీలు ఇప్పటికే ప్రకటించాయి. ఇక్కడి నుంచి పోటీ చేసి తమ సత్తా చాటాలని టీడీపీ చూస్తోంది. ఈ నేపథ్యంలో తమ అభ్యర్థిని ప్రకటించేందుకు కసరత్తు చేస్తోంది. తెలంగాణలో టీడీపీ కనుమరుగు కాలేదనే విషయాన్ని ప్రజల్లో తీసుకెళ్లాలని ఆపార్టీ భావిస్తోంది.
టీఆర్ఎస్ను ఓడించడమే లక్ష్యంగా 2018 డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్ తో కలిసి మహాకూటమి ఏర్పాటు చేసింది. దీంతో హుజూరు నగర్ నియోజవకర్గంలో టీడీపీ.. కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మద్దతు ఇచ్చింది. ఆ ఎన్నికల్లో టీడీపీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు గెలిపొందారు. అయితే 2019 లోక్ సభ ఎన్నికలకు దూరంగా ఉన్న టీడీపీ.. తాజాగా జరిగే ఉపఎన్నికలో మాత్రం ఒంటరి పోరుకు సిద్ధమైంది. గతంలో ఉమ్మడి నల్గొండ జిల్లా టీడీపీకి గట్టి పట్టు ఉండేది. అయితే సీనియర్ నేతలు సైకిల్ దిగి కారెక్కడంతో పార్టీ బలహీన పడింది. అయితే, పార్టీ క్యాడర్ ఒత్తిడి మేరకు ఉపఎన్నికలో పోటీ చేసేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది.
అయితే, హుజూర్ నగర్ టీడీపీ అభ్యర్థిగా ఎవరినీ ప్రకటిస్తారన్నది సస్పెన్స్ గా మారింది. టీ-టీడీపీ నేతలతో సమావేశం అనంతరం హుజూర్ నగర్ అభ్యర్థి ఎంపిక విషయలో చంద్రబాబు తుది నిర్ణయం తీసుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. అక్టోబర్ 21న ఉపఎన్నిక జరగనుంది. అదే నెల 24న కౌంటింగ్ నిర్వహించి ఎన్నికల ఫలితాలు వెలువరిస్తారు. రాబోయే రోజుల్లో పార్టీ సంస్థాగతంగా బలపడి పూర్వవైభవం తెచ్చే కార్యక్రమాలతో ముందుకు సాగుతామని తెలంగాణ టీడీపీ నేతలు అంటున్నారు. అయితే హుజూర్ నగర్ ఉపఎన్నికలో సైకిల్ పరుగులు పెడుతుందో లేదో చూడాలి.