కె.విశ్వనాథ్ని కలిసిన కె.సి.ఆర్
ప్రముఖ సీనియర్ దర్శకుడు కె.విశ్వనాథ్ను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.సి.ఆర్ ఆదివారం మర్యాద పూర్వకంగా కలిశారు. కె.విశ్వనాథ్ని ముఖ్యమంత్రి కె.సి.ఆర్ ప్రత్యేకంగా కలుస్తారని మీడియాలో వార్తలు రాగానే కె.విశ్వనాథ్ ఆరోగ్యం బాగోలేదనే వార్తలు వినిపించాయి. అయితే అలాంటిదేమీ లేదని కె.విశ్వనాథ్ ఓ వీడియో ద్వారా తెలిపారు. అనంతరం కె.సి.ఆర్.. విశ్వనాథ్ ఇంటికి వచ్చి కాసేపు ముచ్చటించి ఆయన ఆరోగ్యం గురించి వాకబు చేశారు. ఈ సందర్భంగా కె.విశ్వనాథ్ మీడియాతో మాట్లాడుతూ “కె.సి.ఆర్ తన ఇంటికి రావడం చూస్తే కుచేలుడి ఇంటికి శ్రీకృష్ణుడు వచ్చినట్లు ఉంది` అన్నారు. తామిద్దరం మర్యాద పూర్వకంగానే కలుసుకున్నామని, అలాగే ఇద్దరి మధ్య సాహిత్యానికి సంబంధించిన చర్చ జరిగిందని అని కూడా తెలిపారు. కె.సి.ఆర్ గురువు చిన్నతనంలో నేర్పిన పద్యం గురించి కూడా మాట్లాడారని, కె.సి.ఆర్లో ఇన్ని కోణాలున్నట్లు తనకు తెలియలేదనీ ఆయన అన్నారు. తనను అభిమానులు సినిమా తీయమంటున్నారని, కానీ తనకు సినిమా తీసే ఓపిక లేదని ఆయన ఈ సందర్భంగా చెప్పారు.