(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
తెలంగాణలో ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెరగనున్నాయి. సోమవారం అర్ధరాత్రి నుంచి పెరిగిన ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. ఈ అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ బస్సులో ప్రయాణించే ప్రయాణికుల నడ్డీ విరగనుంది. వాస్తవానికి డిసెంబర్ 2వ తేదీ నుంచే ఛార్జీల పెంపు ఉంటుందని సీఎం కేసీఆర్ ప్రకటించినప్పటికీ… టికెట్ యంత్రాల్లో మార్పులకు ఒకరోజు సమయం పట్టే అవకాశం ఉండటంతో… ఛార్జీల పెంపును అధికారులు ఒకరోజు వాయిదా వేశారు. ఆర్టీసీ అన్ని బస్సు సర్వీసుల్లో కిలోమీటరుకు రూ. 20 పైసల చొప్పున ఛార్జీలు పెరగున్నాయి. ఈ నేపథ్యంలో ఈ అర్ధరాత్రి నుంచి పెరిగిన ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. ఛార్జీల పెంపు వల్ల ఏడాదికి రూ. 750 కోట్ల అదనపు ఆదాయం వస్తుందని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు.
ఇకపై తెలంగాణలోని ఆర్డినరీ బస్సుల్లో కనీస ఛార్జీ రూ. 10 రూపాయలుగా ఉండనుంది. సిటీ ఆర్డినరీ, ఎక్స్ప్రెస్లోనూ కనీస ఛార్జీ రూ. 10 రూపాయలుగా ఉండనుంది. పల్లె వెలుగు బస్సుల్లో కనీస ఛార్జీ రూ. 5 నుంచి రూ. 10కి, ఎక్స్ప్రెస్ కనీస ఛార్జీ రూ. 10 నుంచి రూ. 15, డీలక్స్ కనీస ఛార్జీ రూ. 15 నుంచి రూ. 20కి పెంచారు. ఇక, సూపర్ లగ్జరీ బస్సుల్లో కనీస ఛార్జీ రూ. 25గా నిర్ణయించారు. రాజధాని, వజ్ర, గరుడ ఏసీ, గరుడ ప్లస్ ఏసీ బస్సుల్లో కనీస ఛార్జీ రూ. 35కు పెంచారు. వెన్నెల ఏసీ స్లీపర్ బస్సుల్లో కనీస ఛార్జీ రూ. 75గా నిర్ణయించారు. ఈ పెరిగిన ఛార్జీలు సోమవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి.
కాగా, ఆర్టీసీ ఉద్యోగులను విధుల్లోకి తీసుకునే సమయంలోనే బస్సు ఛార్జీలను కూడా పెంచుతామని సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అన్ని సర్వీసులపై కిలోమీటర్కు 20 పైసలు పెంచుతామని తెలిపారు. ఈ క్రమంలోనే నేటి అర్థరాత్రి నుంచి బస్సు ఛార్జీలు పెరగనున్నాయి.