ఢిల్లీ: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్ అత్యాచార కేసులో ఢిల్లీలోని తిస్ హజరీ కోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. బిజెపి బహిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్ను న్యాయస్థానం దోషిగా నిర్ధారించింది. ఈ నెల 19న శిక్ష ఖరారు చేయనున్నట్టు ధర్మాసనం పేర్కొంది.ఉన్నావ్ హత్యాచారం కేసు ఎన్నో మలుపులు తిరిగింది. బాధితురాలి కుటుంబంపై పలుమార్లు హత్యాయత్నం కూడా జరిగింది.
వివరాల్లోకి వెళితే 2017లో మైనర్ బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం చేశారు. బాధితురాలి తల్లిదండ్రులు బిజెపి ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్, అతనికి సహకరించిన శశి సింగ్పై పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే అధికార పార్టీ ఎమ్మెల్యే కావడంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేయలేదు. ఈ నేపథ్యంలో బాధితురాలి తల్లిదండ్రులు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి అదిత్యనాధ్ గృహం వద్ద భైటాయించి నిరసనకు దిగారు. దీంతో ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం అయ్యింది. ఆ నేపథ్యంలో ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్, అతనికి సహకరించిన శశిసింగ్పై పోక్సోతో పాటు పలు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.
ఇదిలా ఉండగా అత్యాచార బాధితురాలి తండ్రిపై అక్రమాయుధాలు కేసు నమోదు చేసి పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో ఉండగానే ఆయన అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. గత జులైలో బాధితురాలిపై హత్యాయత్నం జరిగింది. ఆమె ప్రయాణిస్తున్న కారును ట్రక్ ఢీ కొట్టింది. ఈ ఘటనలో బాధితురాలి పిన తల్లి, అత్త ఇద్దరు మరణించగా ఆమెతో పాటు ఆమె తరపు న్యాయవాదికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన ఆమెను విమానంలో ఢిల్లీకి తరలించి ఉన్నత వైద్య సేవలు అందించగా మృత్యువుతో పోరాడి కొద్ది రోజులకు కోలుకున్నది.
బాధితురాలిపై హత్యాయత్నం చేయించింది సెంగార్యేనని ఆరోపణలు వెల్లువెత్తడంతో ఆయన్ను పార్టీ నుండి బిజెపి బహిష్కరించింది. బాధితురాలికి ఢిల్లీ మహిళా కమిషన్ ఆశ్రయమిచ్చింది. సుప్రీం కోర్టు ఆదేశాలతో ఆమె కుటుంబానికి సిఆర్పిఎఫ్ బలగాలతో రక్షణ కల్పించింది. కేసుల పరిస్థితిని సమీక్షించిన సుప్రీంకోర్టు.. లక్నో బెంచ్ నుంచి ఢిల్లీ కోర్టుకు కేసును బదిలీ చేసింది.
న్యాయమూర్తి ధర్మేశ్ శర్మ ధర్మాసనం ఆగస్టు అయిదవ తేదీ నుండి రోజూ వారి విచారణ నిర్వహించింది. అత్యాచారం కేసులో కుల్దీప్ సింగ్ సెంగార్యే దోషిగా నిర్ధారిస్తూ సోమవారం ధర్మాసనం తీర్పు వెలువరించింది.