అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు ఈవిఎంల పని తీరుపై సందేహం వ్యక్తం చేస్తూ కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి సునీల్ అరోరాతో సమావేశం అవ్వటంపై వైసిపి రాజ్యసభ సభ్యడు విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా వరుస ట్వీట్లతో విమర్శలు చేశారు.
40 ఇయర్స్ ఇండస్ట్రీ, ఈవెంట్ మేనేజర్గా మాత్రమే సక్సెస్ అయ్యాడని విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు. విలువలు కలిగిన రాజనీతిజ్ణుడు కాలేకపోయాడని ఆయన విమర్శించారు. ‘ఓడినా గెలిచాననే పిడివాదం. దానికి కుల మీడియా వంత పాడటం. ప్రజలు మూకుమ్మడిగా ఈసడించుకున్నా ఈవిఎంల పైన పడి ఏడవడం. ఈ నలబై రోజులన్నా అపద్ధర్మ సిఎంగా పదవిని ఆస్వాదించు బాబూ’ అంటూ విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు.
దేశమంతా ఎలక్షన్ మూడ్లో ఉంటే ఓట్లు రాలని చంద్రబాబు ఈసి మీద ఫిర్యాదులంటూ ఢిల్లీ వెళ్లి పరువు తీసుకుంటున్నాడని విజయసాయి రెడ్డి అన్నారు. 80 శాతం పోలింగ్ జరిగితే మిషన్లు పనిచేయలేదని అనడంలో లాజిక్ అర్థం కాక ఈయనతో అంటకాగిన నాయకులు కూడా తల పట్టుకుంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ఈ బురద తమకెక్కడ పూస్తాడో అని అంతా దూరం పెట్టారని విజయసాయి రెడ్డి చెప్పుకొచ్చారు.
‘సిఎస్ పునేఠా, ఇంటెలిజెన్స్ చీఫ్ వెంకటేశ్వరరావు, ముగ్గురు ఎస్పిలు, పక్కకు తప్పించిన అధికారులు చంద్రబాబుకు కీలుబొమ్మలని చూపే ఆధారాలు ఎలక్షన్ కమిషన్ దగ్గరున్నాయి. అనవసరంగా కెలుక్కుని అవన్నీ బయటపెట్టించుకుంటాడు. బట్టలు చింపుకుని ఢిల్లీ వీధుల్లో పరువు తీసుకోవడం తప్ప ప్రయోజనం ఉంటుందా?’ అని విజయసాయి రెడ్డి ప్రశ్నించారు.
చంద్రబాబు వ్యవహారం పరీక్ష సరిగ్గా రాయని విద్యార్థి ప్రశ్నపత్రంపై ఫిర్యాదు చేసినట్టుందని విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు. కేంద్ర ఇంటెలిజెన్స్ చీఫ్ను బదిలీ చేయకుండా తన బంధువైన ఏబి వెంకటేశ్వరరావును ఎలా పక్కకు తప్పిస్తారని అడుగుతుంటే ఇతని మానసిక స్థితి బాగా లేదని దేశమంతా తెలిసి పోయిందని విహాయసాయి రెడ్డి అన్నారు.
బ్యాలెట్ పేపర్ రోజుల్లో రిగ్గింగ్ తేలికగా జరిపేవారనీ, ఎన్నికల సిబ్బందినీ, ఏజెంట్లను మ్యానేజ్ చేస్తే టకాటకా గుద్ది బాక్సుల్లో వేయించిన అనుభవం చంద్రబాబుదని విజయసాయి రెడ్డి ఆరోపించారు. ఓటింగ్ మిషన్లను రిగ్గింగ్ చేయాలంటే చాలా సమయం పడుతుందనీ, అందరికీ తెలిసిపోతుందనీ, అందుకే పదేపదే బ్యాలెట్ పేపర్ కావాలంటున్నాడనీ విజయసాయి రెడ్డి దుయ్యబట్టారు.
ఎవరు కొడితే మైండ్ బ్లాక్ అవుతుందో వారే ఆంధ్ర ఓటర్లు అని విజయసాయి రెడ్డి అన్నారు. మైండ్ బ్లాకయిన వ్యక్తి తనకెందుకు అలా అయిందో గ్రహించకుండా ఈవిఎంలపై ఓటు వేయడం విద్యావంతులకు కూడా కష్టమని అంటున్నాడని, వివి ప్యాట్ల లెక్కింపుపై సుప్రీం కోర్టు తీర్పునూ తప్పుపడుతున్నాడని విజయసాయి రెడ్డి విమర్శించారు. దెబ్బ మామూలుగా తగిలినట్టు లేదు అంటూ విజయసాయి రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు.