హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం వద్ద కనీసం 47 కోట్ల రూపాయల నిధులు కూడా లేకపోతే.. హుజూర్నగర్ కు ఇచ్చిన వంద కోట్ల హామీలు ఎలా అమలు చేస్తారని కాంగ్రెస్ పార్టీ నాయకురాలు విజయశాంతి ప్రశ్నించారు. ఆర్టీసీ సమ్మెకు సంబంధించి హైకోర్టులో టిఆర్ఎస్ ప్రభుత్వ తరపు న్యాయవాది చేసిన వాదనపై ఆమె స్పందించారు. హైకోర్టు వేసిన ప్రశ్నతో కేసీఆర్ అడ్డంగా దొరికిపోయారని చెప్పారు. ‘కోర్టు వేసిన ప్రశ్నకు సమాధానంగా హుజూర్ నగర్ లో వంద కోట్ల రూపాయల అభివృద్ధి పథకాలు అమలు చేయడానికి ప్రభుత్వం వద్ద తగిన నిధులు ఉన్నాయని అంగీకరించడం లేదా కేవలం ఉత్తుత్తి హామీలు ఇచ్చానని చేతులెత్తేయడం ఈ రెండిటిలో ఏదో ఒకటి చేయాలి. ఒకవేళ హుజూర్ నగర్ అభివృద్ధికి వంద కోట్ల రూపాయలు కేటాయిస్తే అప్పుడు ఆర్టీసీ కార్మికులకు కూడా 47 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది’ అని వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లో సీఎం కేసీఆర్ ఇచ్చే ఏ హామీ కూడా అమలు కాదని స్పష్టంగా అర్థం అవుతోందని తెలిపారు. కేసీఆర్ హుజూర్ నగర్ ప్రజలకు ఇచ్చిన హామీలు ఉత్తుత్తివా? లేక కోర్టుకు అవాస్తవాలు చెప్పారా? అని ఆమె ప్రశ్నించారు. ఈ మేరకు ఆమె ఫేస్ బుక్ లో ఓ పోస్ట్ పెట్టారు.