హైదరాబాద్: తెలంగాణలో ఆర్టీసీ సమ్మె మరింత ఉధృతమవుతోంది. గత 26 రోజులుగా వివిధ రూపాల్లో నిరసన, ఆందోళన కార్యక్రమాలు నిర్వహించిన కార్మికులు.. బుధవారం ‘సకల జనుల సమర భేరి’ పేరిట భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. ప్రభుత్వంపై ఉన్న ఆగ్రహాన్ని తెలియజెప్పడమే ప్రధాన ఉద్దేశంగా ఈ సభను నిర్వహిస్తున్నారు. సరూర్నగర్ స్టేడియంలో మధ్యాహ్నం సభ ప్రారంభం కానుంది. సాయంత్రం ఐదు గంటల వరకు సభ జరగనుంది. ఈ సభకు ప్రధాన రాజకీయ పార్టీలు, ప్రజా, కార్మిక, విద్యార్థి, ఉపాధ్యాయ, కుల సంఘాలు ఈ సభకు మద్దతిస్తున్నాయి. ఆయా సంఘాల నాయకులు సభలో పాల్గొని కార్మికుల్లో మనోధైర్యం పెంపొందించేలా ప్రసంగించనున్నారు. సకల జనుల సమర భేరి సభకు కార్మికులు పెద్దసంఖ్యలో తరలిరావాలని జేఏసీ నేతలు పిలుపునిచ్చారు.
ఆర్టీసీ కార్మికులు తమ సమ్మెలో భాగంగా నిర్వహించ తలపెట్టిన ‘సకల జనుల సమరభేరి’ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అయితే.. ఈ సభ నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. దీంతో వారు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ను బుధవారం మధ్యాహ్నం విచారించిన హైకోర్టు… షరతులతో అనుమతి మంజూరు చేసింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతియుతంగా నిర్వహించుకుంటామని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి పోలీసులకు హామీ ఇవ్వాలని ఆదేశించింది. రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేయరాదని సూచించింది. బుధవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు సభ నిర్వహించుకుంటామని ఆర్టీసీ సంఘాలు కోరగా.. హైకోర్టు గంట సమయాన్ని కుదించింది. 2 గంటల నుంచి 5 గంటల వరకు నిర్వహించుకోవాలని సూచించింది.