అమరావతి : ఇంత బతుకు బతికి ఇంటెనక… అన్నట్లుగా ఉంది చంద్రబాబు పరిస్థితి అని ఎద్దేవా చేశారు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి. ట్విట్టర్ వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబుపై విజయసాయి రెడ్డి సెటైర్లు వేశారు. తన దోపిడీ వ్యవహారాల గుట్టంతా మాజీ పిఎస్ శ్రీనివాస్ వద్ద ఉన్నట్టు ఐటి దాడుల తర్వాత క్లియర్ గా అర్థమైందని వ్యాఖ్యానించారు. మ్యానిపులేషన్లతో వ్యవస్థలను చెరబట్టిన వ్యక్తి చివరకు శ్రీనివాస్ అనే ఉద్యోగి దగ్గర తన ‘పాస్ వర్డ్’ వదిలేశాదని సెటైర్ వేశారు.
బాబు మాజీ పిఎస్ శ్రీనివాస్ కమిట్ మెంటుని మెచ్చుకోవాలన్నారు. ‘యజమాని ప్రతి లావాదేవీనీ డైరీలో రాసుకున్నాడు. కంప్యూటర్లో నిక్షిప్తం చేసాడు. ఇంకా అప్పగించాల్సిన పద్దులను అలాగే దాచి ఉంచాడు. దోచుకున్నవి, దొంగదారుల్లో పంపిన లెక్కలన్నిటినీ పర్ ఫెక్టుగా రికార్డు చేసాడు’ అని ట్వీట్ చేశారు.
మాజీ పిఎస్ వద్ద రెండు వేల కోట్ల రూపాయల అక్రమ లావాదేవీలు ఐటీ తనిఖీల్లో లభ్యమైయ్యాయని వైసీపీ నేతలు ఆరోపిస్తుండగా టీడీపీ వారు మాత్రం రెండు లక్షల పైచిలుకు నగదు మాత్రమే దొరికిందని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో విజయసాయి రెడ్డి పై విధంగా వ్యాఖ్యానిస్తూ విమర్శించారు.