న్యూఢిల్లీ: ఈ నెల 30న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న వైఎస్ జగన్మోహనరెడ్డి నేడు హస్తినకు చేరుకున్నారు. హైదరాబాదు బేగంపేట ఎయిర్ పోర్టు నుండి ప్రత్యేక విమానంలో న్యూఢిల్లీకి చేరుకున్న జగన్కు ఎపి భవన్ అధికారులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రధాని నివాసానికి బయలుదేరారు. రెండవ సారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్న నరేంద్ర మోదిని మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేయడంతో పాటు తన ప్రమాణ స్వీకారానికి జగన్ అహ్వానించనున్నారు. ఇదే సందర్భంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రాష్ట్రాభివృద్ధికి ఆర్థిక చేయూత తదితర అంశాలపైనా వినతి పత్రం అందజేయనున్నట్లు సమాచారం.
ప్రధానితో భేటీ అనంతరం ఎపి భవన్కు చేరుకోనున్నారు. జగన్ వెంట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రమణ్యం, వైసిపి రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, ఎంపిలుగా విజయం సాధించిన పివి మిథున్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి, బాలశౌరి, నందిగం సురేష్, మార్గాని భరత్ తదితరులు ఉన్నారు.
సాయంత్రం వరకూ ఢిల్లీలోని కార్యక్రమాల్లో జగన్ పాల్గొని రాత్రి ఇక్కడే బస చేసి సోమవారం ఉదయం ఆంధ్రప్రదేశ్కు బయలుదేరతారు.