అమరావతి: ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతున్నట్టు జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయం పట్ల రాజకీయ దుమారం ఇంకా కొనసాగుతోంది. ఈ అంశంపై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మీ పిల్లలు ఏ మీడియంలో చదువుతున్నారని ఒకరినొకరు ప్రశ్నించుకుంటున్నారు. ఇదిలా ఉంటే జగన్ ఇంగ్లీష్ మీడియం హామీని పాదయాత్ర సమయంలోనే ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. జగన్ పాదయాత్ర చేస్తున్న సమయంలో ఓ సామాన్యుడు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం బోధించాలని కోరాడు. దానికి జగన్ ఒకే చెప్పినట్టుగా ఆ వీడియోలో ఉంది. అప్పుడు ఇచ్చిన హామీనే జగన్ ఇప్పుడు నెరవేర్చారని నెటిజన్లు అంటున్నారు.
https://www.facebook.com/babul.thumma/videos/10215479715247526/
ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ఏపి మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ ప్రకంపనలు సృష్టించాయి. ప్రతిపక్షనేత చంద్రబాబు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిల్లలు ఏ మీడియంలో చదువుతున్నారో తెలపాలని డిమాండ్ చేశారు. అయితే, దీనికి కౌంటర్గా నారా లోకేష్ ట్వీట్ చేస్తూ మీ పిల్లలు ఏ మీడియంలో చదువుతున్నాని ప్రశ్నించారు.
నవంబర్ 11న జాతీయ విద్యా దినోత్సవ వేడుకలను ఏపి ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. ప్రాథమిక విద్య నుంచే సంస్కరణలు తీసుకురావలని ఏపి ప్రభుత్వం భావించింది. అందుకోసమే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. విద్యారంగంలో పేదలు కూడా రాణించాలంటే ఇంగ్లీషు మీడియం చదువులు ముఖ్యం అని సీఎం వైఎస్ జగన్ చెప్పారు. ఇంగ్లీష్ భాష సరిగా నేర్చుకోకపోతే నేటి యువత ప్రపంచంతో పోటీ పడలేరని ఆయన అభివర్ణించారు.