మా జీతాలేవో మాకు ఇప్పించండి
మేమూ మనుషులమే.. ఒత్తిడి తప్పదు
జెట్ ఎయిర్ వేస్ పైలట్ల మొర
న్యూఢిల్లీ: విమానం నడిపేందుకు కాక్ పిట్ లోకి ప్రవేశించేముందు ఎలాంటి మానసిక ఒత్తిడి ఉండకూడదనే అనుకుంటాం గానీ, తాము కూడా మనుషులమేనని జెట్ ఎయిర్ వేస్ సీనియర్ పైలట్ ఒకరు అన్నారు. దాదాపు నాలుగు నెలల నుంచి సిబ్బంది ఎవరికీ ఆ సంస్థ జీతాలు చెల్లించడం లేదు. దాంతో తప్పనిసరై.. ఈఎంఐలు కట్టడానికి, ఇతర ఖర్చుల కోసం తన తల్లి నగలను తాకట్టు పెట్టాల్సి వచ్చిందని పైలట్ ఒకరు వాపోయారు. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న జెట్ ఎయిర్ వేస్ సంస్థ కుప్పకూలిపోవడానికి సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. దాదాపు 100 కోట్ల డాలర్ల అప్పులో సంస్థ ఉంది. దాంతో చాలావరకు విమానాలను నేలకే పరిమితం చేసింది.
‘‘మేమూ మనుషులమే. మాకూ ఒత్తిడి బాగా పెరిగిపోతోంది. మేం ఎంత ప్రయత్నించినా అది మాత్రం తగ్గడం లేదు. ఇన్ని నెలలుగా జీతాలు లేకపోవడం సరికాదు.. ఈ పరిస్థితులను వెంటనే మార్చాలి’’ అని బోయింగ్ 777 కమాండర్ కెప్టెన్ కరణ్ చోప్రా అన్నారు. ఆయనకు దాదాపు 2 దశాబ్దాలకు పైగా అనుభవం ఉంది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి సురేశ్ ప్రభుకు కెప్టెన్ చోప్రా ఓ లేఖ రాశారు. ఆయన జెట్ ఎయిర్ వేస్ పైలట్ల సంఘం అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. ‘‘పైలట్లు ఒత్తిడికి గురైతే ప్రజల భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదముంది. ఇది మాలాంటి ఉద్యోగాలలో ఉన్నవారికి ఏమాత్రం సరికాదు. మేం నిరంతరం అత్యంత అప్రమత్తంగా ఉంటేనే భద్రత ఉంటుంది’’ అని ఆ లేఖలో పేర్కొన్నారు. తమకు బకాయిపడ్డ జీతాలన్నీ చెల్లించకపోతే ఏప్రిల్ 1వ తేదీ నుంచి విమానాలు నడిపించేది లేదని దాదాపు 1100 మంది పైలట్లు ఏకగ్రీవంగా నిర్ణయించుకున్నారు. జీతాలు ఇవ్వడంతో పాటు భవిష్యత్తు గురించి కూడా స్పష్టంగా చెప్పాలని, తమ డిమాండ్లు నెరవేరకపోతే విమానాలు ఎగరవని కెప్టెన్ ఆసిమ్ వలియానీ కుండ బద్దలుకొట్టారు.
మరోవైపు దాదాపు 250 మందికి పైగా పైలట్లు వేరే కంపెనీలలో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారు. తమ సంస్థ కుప్పకూలితే దాదాపు 1500 మంది పైలట్లు రోడ్డున పడతారని, అన్ని ఉద్యోగాలు మార్కెట్లో లేవని వలియానీ అన్నారు. అందుకే ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేస్తున్నారని, తాను ఎవరినీ తప్పుబట్టనని చెప్పారు. తాము కూడా ఈఎంఐలు, పిల్లల స్కూలు ఫీజులు, తల్లిదండ్రుల ఆసుపత్రి బిల్లులు చెల్లించాలని, వీటన్నింటికీ ఎక్కడినుంచి తేవాలని ప్రశ్నిస్తున్నారు. ఇంకా పెళ్లి కాని యువపైలట్లు తమ తల్లి నగలు తాకట్టులో పెట్టామని, త్వరగా జీతాలు ఇప్పించాలని సీనియర్లకు ఫోన్లు చేస్తున్నారు.