న్యూస్ ఛానల్ టివి9 మాజీ సిఇఒ రవిప్రకాష్ను హైదరాబాద్ పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. టివి9 యాజమాన్య సంస్థ అయిన అలంద మీడియాను భారీస్థాయిలో మోసగించారన్న ఫిర్యాదుపై ఆయనను బంజారా హిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కంపెనీ ఖాతాల నుంచి బోర్డు డైరక్టర్లకు తెలియకుండా భారీ మొత్తంలో రవిప్రకాష్ నిధులు విత్డ్రా చేసుకున్నారని అలంద మీడియా యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. సెక్షన్ 41 కింద మొదట రవిప్రకాష్కు నోటీసులు ఇచ్చారు. వాటికి ఆయన స్పందించకపోవడంతో పోలీసులు వెళ్లి రవిప్రకాష్ను అదుపులోకి తీసుకున్నారు.
రవిప్రకాష్తో పాటు పాత యాజమాన్యం కింద డైరక్టర్లుగా ఉన్న ఎమ్వికెఎన్ మూర్తి, క్లిప్ఫర్డ్ పెరీరాపై కూడా పోలీసులు ఐపిసి సెక్షన్లు 409, 418, 420 కింద కేసు నమోదు చేశారు. వీరు ముగ్గురూ కలిసి గత రెండేళ్ల లాభాన్ని తమ సొంత ఖాతాలకు మళ్లించారన్నది ప్రధాన అభియెగం.
రవిప్రకాష్ 6.37 కోట్ల రూపాయలు, మూర్తి 5.97 కోట్ల రూపాయలు, పెరీరా మరో 5.97 కోట్ల రూపాయలు కంపెనీ బ్యాంకు ఖాతాల నుంచి విడుదల చేసినట్లు గుర్తించారు. గత నెల 24వ తేదీన అలంద మీడియా డైరక్టర్ల బోర్డు సమావేశమై నిధుల మళ్లింపు గురించి చర్చించింది. అనంతరం బంజారా హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఎబిసి ప్రయివేట్ లిమిటెడ్ అనే సంస్థ పేరన ఐల్యాబ్స్ యజమాని శ్రీనిరాజు రవిప్రకాష్ నేతృత్వంలో టివి9 ఛానల్ మొదలుపెట్టారు. అది విజయవంతంగా నడిచి ఒక గ్రూప్గా విస్తరించింది. గత సంవత్సరం శ్రీనిరాజు టివి9 గ్రూప్ను మైహోం రామేశ్వరరావు, మేఘా ఇంజినీరింగ్ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలోని అలంద మీడియా సంస్థకు విక్రయించారు. ఆ యాజమాన్య మార్పిడి ఇష్టంలేని రవిప్రకాష్ సంస్థ తమ చేతికి రాకుండా అడ్డంకులు సృష్టించారని గత మే నెలలో అలంద యాజమాన్యం ఆరోపించింది. పోలీసులు తనను అరెస్టు చేయకుండా రవిప్రకాష్ ముదస్తు బెయిల్కు ప్రయత్నించారు. హైకోర్టు ఆదేశానుసారం పోలీసుల ముందు హాజరయ్యారు. ఆయనను పోలీసులు అప్పుడు ప్రశ్నించి వదిలిపెట్టారు.