హైదరాబాద్: ఆర్టీసీకి ప్రభుత్వం ఎలాంటి బాకీ లేదని ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు స్పష్టం చేశారు. ఆర్టీసీ సమ్మెపై ఆర్టీసీ ఇన్చార్జ్ ఎండీ సునీల్ శర్మ, ఆర్థికశాఖ కార్యదర్శి రామకృష్ణారావు, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. ఈ అఫిడవిట్లపై గురువారం న్యాయస్థానం విచారించనున్నది. ఆర్టీసీకి రూ.3,006 కోట్ల అప్పులు ఉంటే ప్రభుత్వం రూ.3,903 కోట్లు ఇచ్చిందని పేర్కొన్నారు. మోటారు వాహనాల పన్ను కింద ప్రభుత్వానికి ఆర్టీసీనే రూ.540 కోట్లు ఇవ్వాలని అఫిడవిట్లో వెల్లడించారు. మరిన్ని నిధులు రాబట్టాలనే ఉద్దేశంతో.. ప్రభుత్వం నుంచి ఆర్టీసీకి నిధులు రావాలంటూ మంత్రికి తెలియజేసినట్లు తెలిపారు. రుణం పద్దు కింద విడుదల చేసినవాటికి ప్రభుత్వం ఎప్పుడూ వడ్డీ అడగలేదన్నారు. జీహెచ్ఎంసీ ఆర్థిక పరిస్థితి బట్టే ఆర్టీసీకి సాయం చేసిందన్నారు. ఇప్పుడు ఆర్టీసీకి చెల్లించే స్థితిలో జీహెచ్ఎంసీ లేదని కమిషనర్ లోకేశ్ కుమార్ అఫిడవిట్ లో తెలిపారు. 2014-15 మిగులు బడ్జెట్ ఉన్నపుడు ఆర్టీసీకి జీహెచ్ఎంసీ నిధులు ఇచ్చిందన్నారు. 2015-16 నుంచి జీహెచ్ఎంసీ లోటు బడ్జెట్లోనే కొనసాగుతుందని, చట్టం ప్రకారం ఆర్టీసీ నిధులు ఇవ్వాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
అంతకు ముందు ఆర్టీసీ సమ్మెపై ప్రగతి భవన్ లో రావాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్, ఆర్టీసీ, రవాణాశాఖ ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. సమ్మె నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, హైకోర్టు ముందు ఉంచాల్సిన అంశాలపై సమీక్ష నిర్వహించారు. ప్రజలకు ఇబ్బంది తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.
ఆర్టీసీ ఎండీ ఇచ్చిన రిపోర్ట్ అర్ధరహితంగా ఉందని, కోర్టును తప్పుదోవ పట్టించేలా ఉందని ఇటీవల హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఎండీ దాఖలు చేసిన అఫిడవిట్కు అసెంబ్లీలో మంత్రి చెప్పిన వాటికి విరుద్ధంగా ఉన్నాయని నవంబర్ 6 లోపు పూర్తిస్థాయి నివేదిక సమర్పించాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు గురువారం (నవంబర్ 7) సీఎస్తోపాటు ఆర్ధికశాఖ ముఖ్య కార్యదర్శి, రవాణాశాఖ కార్యదర్శి, జీహెచ్ఎంసీ కమిషనర్తోపాటు ఆర్టీసీ అధికారులందరూ హైకోర్టు ముందుకు హాజరుకానున్నారు.