అమరావతి: ఆంధ్రప్రదేశ్కు మూడు రాజధానులు ఏర్పడవచ్చునంటూ సిఎం జగన్ చేసిన ప్రకటనపై బిజెపి నేతల్లో బిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ జరగాల్సింది పరిపాలనా వికేంద్రకరణ కాదు, అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలంటున్నారు.సచివాలయం ఒక చోట, హెచ్ఒడిలు, హైకోర్టు మరో చోట సరికాదని ఆయన అంటున్నారు. రాజధాని రైతులకు బిజెపి అండగా ఉంటుందని కూడా భరోసా ఇస్తున్నారు. సీడ్ క్యాపిటల్ మారిస్తే బిజెపి చూస్తూ ఊరుకోదని కూడా అన్నారు. ఒక్క అవకాశం ఇవ్వండి స్వర్గం చూపిస్తానన్న జగన్ రాష్ట్రాన్ని ఎటు తీసుకువెళ్తున్నారో తెలియడం లేదని కన్నా వ్యాఖ్యానించారు. జగన్ అనుభవరాహిత్యం, ఆత్రుత వల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగిందని ఆయన అన్నారు. తన హయాంలో చంద్రబాబు ఇష్టానుసారంగా డబ్బులు తగలేశారని కన్నా విమర్శించారు. ప్రజల ఆస్తులను చంద్రబాబు తాకట్టు పెడితే జగన్ అమ్మేస్తున్నారని ఆయన విమర్శించారు.
ఇలా కన్నా వ్యాఖ్యానిస్తుండగా ఆదే పార్టీకి చెందిన రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధనరెడ్డి రాయలసీమ, ఉత్తరాంధ్ర అభివృద్ధి వికేంద్రీకరణను బిజెపి స్వాగతిస్తుందన్నారు. రాయలసీమను రెండవ రాజధానిగా చేయాలనీ, హైకోర్టు ఏర్పాటు చేయాలనీ గతం నుండి డిమాండ్ ఉందన్నారు. విశాఖను ఆర్థిక రాజధాని చేస్తే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు. సీడెడ్ రాజధాని మాత్రం అమరావతిలోనే ఉండాలనీ, అమరావతి సైతం అభివృద్ధి కావాలనీ విష్ణువర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. రాజధాని పేరుతో చంద్రబాబు కాలయాపన, భూకుంభకోణం చేశారని ఆయన ఆరోపించారు. చంద్రబాబు భూకుంభకోణంపై సిబిఐ విచారణకు జగన్ ప్రభుత్వం లేఖ రాసి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని అన్నారు. చంద్రబాబు ఉత్తరాంధ్ర, రాయలసీమని నిర్లక్ష్యం చేసి రెండు ప్రాంతాల ప్రజలను మోసం చేశారని పేర్కొన్నారు. మూడు ప్రాంతాల అభివృద్ధికి కేంద్రంలోని బిజెపి సహకరిస్తుందని విష్ణువర్థనరెడ్డి తెలిపారు. మరో పక్క ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు టిజి వెంకటేష్ కూడా జగన్మోహనరెడ్డి ప్రకటనను స్వాగతిస్తున్నారు.