(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచార కేసు నిందితులకు సంబంధించి మరిన్ని షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేసు విచారణలో వీరు ఒళ్లు గగుర్పొడిచే విషయాలను వెల్లడించినట్టు సమాచారం. దిశపై అత్యాచారానికి తెగబడడానికి ముందు నిందితులు మరో 9 మంది మహిళలపై అత్యాచారం చేసి హత్య చేసినట్టు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో వెల్లడించినట్టు తెలుస్తోంది. దిశ కేసులో ప్రధాన నిందితుడైన అరీఫ్ ఆరుగురిని హత్య చేయగా, చెన్నకేశవులు ముగ్గురిని అంతమొందించినట్టు చెప్పారు. ఈ ఘటనలన్నీ మహబూబ్నగర్, సంగారెడ్డి, రంగారెడ్డి, హైదరాబాద్, కర్ణాటక ప్రాంతాల్లోని హైవేల సమీపంలో చేసినట్టు నిందితులు అంగీకరించినట్టు తెలుస్తోంది. అత్యాచారం అనంతరం హత్య చేసి మృతదేహాలను దహనం చేసినట్టు నిందితులు తమ వాంగ్మూలంలో వెల్లడించినట్టు సమాచారం. వారు చెప్పిన సమాచారం ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఆయా ప్రాంతాల్లో మొత్తం 15 ఘటనలు జరిగినట్టు గుర్తించారు. దిశ నిందితుల డీఎన్ఏను మృతి చెందిన వారి డీఎన్ఏతో విశ్లేషిస్తున్నారు. నిందితులకు సంబంధించి కోర్టుకు సమర్పించనున్న చార్జిషీట్లో వారు వెల్లడించిన నేరాలకు సంబంధించిన వివరాలను కూడా పొందుపర్చనున్నట్టు తెలుస్తోంది.
ఈ కేసు దర్యాప్తులో సైబరాబాద్ పోలీసులు వేగాన్ని పెంచారు. ఈ నెలాఖరులో పూర్తి సాక్ష్యాధారాలతో చార్జిషీటును ఫాస్ట్ ట్రాక్ కోర్టులో పొందుపర్చనున్నారు. ఈ కేసులో మొత్తం 30 మంది సాక్షుల స్టేట్మెంట్స్ను పోలీసులు రికార్డు చేశారు. విచారణలో వీరందర్నీ కూడా పోలీసులు ఫాస్ట్ ట్రాక్ లో హాజపర్చే అవకాశం ఉంది. ఇప్పటికే డీఎన్ఏ రిపోర్ట్స్, ఫోరెన్సిక్ నివేదికను పోలీసులు తెప్పించుకున్నారు. అత్యాచారం, హత్య ప్రాంతాల్లో దొరికిన సీసీ ఫుటేజ్ కీలకంగా ఉన్నాయి.
నవంబరు 27వ తేదిన దిశ హత్యాచారానికి గురయిన సంగతి తెలిసిందే. దిశను టైరు పంక్చర్ అయ్యిందని మాయ మాటలు చెప్పి ఆమెను కిడ్నాప్ చేసి లైంగిక దాడికి పాల్పడి అనంతరం హత్య చేసి, శంషాబాద్ నుంచి చటాన్పల్లి ప్రాంతానికి తీసుకువెళ్ళి అండర్పాస్ బ్రిడ్జి వద్ద దహనం చేశారు. ఈ కేసు మిస్టరీని 24 గంటల్లో చేధించిన పోలీసులు.. నిందితులైన అరిఫ్, చెన్నకేశవులు, నవీన్, శివలను గుర్తించి 30వ తేదిన అరెస్టు చేశారు. డిసెంబరు 6న నిందితులు చెప్పిన వాంగ్మూలం ఆధారంగా ఆమె ఫోన్, పవర్ బ్యాంక్, వాచీని రికవరీ చేసేందుకు వెళ్లిన పోలీసులపై తిరగబడి కాల్పులకు దిగడంతో పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నలుగురు మృతి చెందిన సంగతి తెలిసిందే.