(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
ఏపీకి మూడు రాజధానులు ఉండే అవకాశం ఉందని సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచీ రాజధానిపై మాట్లాడని జగన్.. తొలిసారిగా అసెంబ్లీ వేదికగా చేసిన ప్రకటన ఇప్పుడు సంచలనంగా మారింది. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ రాజధాని తరలిస్తారని ప్రచారం జరిగింది. పలు సందర్భాల్లో మంత్రులు బొత్స, బుగ్గన తదితరులు రాజధానిపై చేసిన వ్యాఖ్యలు చేయడంతో రైతులు, ప్రజల్లో ఆందోళన మొదలైంది. అయితే, అసెంబ్లీ సమావేశాల్లో అమరావతే రాజధానిగా ఉంటుందని మున్సిపల్ మంత్రి బొత్స మండలిలో చెప్పిన కొన్ని గంటల్లోనే యూటర్న్ తీసుకున్నారు. నిపుణుల కమిటీ ఇచ్చే రిపోర్టు ఆధారంగా రాజధాని ఉంటుందని చెప్పారు. దీంతో మరోసారి రాజధాని అంశం చర్చనీయాంశంగా మారింది. ఈ తరుణంలో అసెంబ్లీ సమావేశాల అఖరి రోజు సీఎం జగన్ ఈ అంశంపై క్లారిటీ ఇచ్చేశారు. అభివృద్ధికి వికేంద్రీకరణ అవసరమని.. దక్షిణాఫ్రికా లాంటి దేశాలకు మూడు రాజధానులు ఉన్నాయని చెప్పిన జగన్.. రాష్ట్రానికి మూడు రాజధానులు రావొచ్చేమోనని సంచలన ప్రకటన చేశారు. అమరావతిలో లెజిస్లేటివ్ క్యాపిటల్, విశాఖపట్టణంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టొచ్చు, ఇక కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయొచ్చేమో అని జగన్ సూచనప్రాయంగా తెలిపారు.
అయితే ఇది ఎంత వరకు సాధ్యమవుతుంది? దీనిని ప్రజలు స్వాగతిస్తారా ? అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇన్నాళ్లు అమరావతే రాజధానిగా ఉంటుందని భావించిన ప్రజలకు సీఎం ప్రకటన కాస్తా అయోమయానికి గురి చేసిందనే చెప్పాలి. సౌతాఫ్రికాకు మూడు రాజధానులు ఉండటం వెనుక ప్రత్యేక కారణాలు ఉన్నాయి. అదే ఏపీలో మూడు రాజధానులు సాధ్యమవుతాయా? అనేది ప్రశ్న. అభివృద్ధి వికేంద్రీకరణ వేరు.. పరిపాలన వికేంద్రీకరణ వేరు అనే అభిప్రాయం ప్రస్తుతం వ్యక్తమవుతోంది. ఏడాదిలో 60 రోజులు అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి. ఈ రెండు నెలలు సెక్రటేరియట్ మొత్తం అమరావతిలో ఉండాల్సిందే. ప్రిన్సిపల్ సెక్రటరీ మొదలుకొని కింది స్థాయి అధికారి వరకు అందరూ వైజాగ్ నుంచి అమరావతికి రావాల్సి వస్తుంది. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రంపై ఇది మరింత భారం మోపుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక హైకోర్టును రాయలసీమలో ఏర్పాటు చేయాలని గత కొంత కాలంగా ఆప్రాంత వాసులు డిమాండ్ చేస్తున్నారు. తాజాగా సీఎం కూడా కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయొచ్చేమో అని ప్రకటన చేశారు. హైకోర్టులో ప్రభుత్వానికి సంబంధించి చాలా కేసులు ఉంటాయి. కేసులు వాయిదా పడినప్పుడల్లా.. ఉద్యోగులు ఫైళ్లను మోసుకొని వైజాగ్ నుంచి కర్నూలుకు వెళ్లాలి. ఇది ఆర్థికంగా భారాన్ని మోపుతుంది. హైకోర్టు ఏర్పాటు చేసినంత మాత్రాన కర్నూలు అభివృద్ధి చెందదు. పరిశ్రమలు వస్తేనే డెవలప్ అవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు కూడా ఇదే అభిప్రాయన్ని వ్యక్తం చేశారు. మూడు రాజధానులు ఉంటే.. సీఎం ఎక్కడ ఉంటారు? పరిపాలన ఎక్కడి నుంచి చేస్తారు? అని ప్రశ్నించారు.
ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారనిపిస్తోంది. నిపుణుల కమిటీ నివేదిక రాకముందే ఈ అంశంపై సీఎం ప్రకటన చేశారు. దీని ద్వారా ప్రజల్లో ఎలాంటి స్పందన వస్తుంది ? అని తెలుసుకునే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. అమరావతిని సింగపూర్ మాదిరిగా అభివృద్ధి చేస్తాను…ప్రపంచ స్థాయి రాజధాని చేస్తానని చెప్పి చంద్రబాబు రైతుల దగ్గర నుంచి 33 వేల ఎకరాలు తీసుకుని ఐదు సంవత్సరాల్లో పూర్తి గ్రాఫిక్స్ లో ఓ సినిమా చూపించేశారనేది ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం చెబుతున్న మాట. ఐదేళ్లు మాయమాటలు చెప్పి తాత్కాలిక సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీ కట్టి ప్రజలకు ఓ మయసభ చూపించారు. అలాగే టీడీపీ నేతలకు వేల ఎకరాలు కట్టబెట్టి ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డారని వైసీపీ వాధిస్తుంది.
ఏపీలో సింగపూర్ లాంటి రాజధానిని నిర్మిస్తానని నాడు చంద్రబాబు అంటే.. ఇప్పుడు దక్షిణాఫ్రికా లాంటి రాజధానులను నిర్మిస్తానని ప్రస్తుత సీఎం జగన్ అంటున్నారు. ప్రజలు ఇప్పుడు దేనిని విశ్వసించాలి? రాజధానిపై వారం రోజుల్లో నిపుణుల కమిటీ నివేదిక వస్తుంది. ఆయా నివేదికలు వచ్చిన తర్వాత సుదీర్ఘంగా ఆలోచన చేసి ఓ మంచి నిర్ణయం తీసుకుంటామని సీఎం చెప్పారు. దీంతో కమిటీ ఎలాంటి రిపోర్టు ఇస్తుంది ? అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సీఎం ప్రకటించినట్లు మూడు రాజధానులను ప్రతిపాదిస్తారా ? లేక మరో మార్గం ఏమైనా సూచిస్తారా? అనేది చూడాలి.