తిరుపతి: చంద్రబాబు విధానాలను వ్యతిరేకించడమే లక్ష్యంగా సీఎం జగన్ పాలన సాగిస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. మూడు రాజధానుల ప్రకటనతో సీఎం జగన్ ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించారని ఆరోపించారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ హైకోర్టు ఏర్పాటుతో రాయలసీమ అభివృద్ధి చెందదని.. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, పరిశ్రమల ఏర్పాటుతోనే సాధ్యమని తెలిపారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో సచివాలయాలు, హైకోర్టు వేర్వేరు ప్రాంతాల్లో అన్నాయని, కానీ ఎక్కడా సచివాలయం, అసెంబ్లీ వేరుగా లేవని గుర్తు చేశారు. సచివాలయం ఒకచోట, మంత్రుల నివాసాలు మరోచోట ఉంటే విహారయాత్రలా ఉంటుంది తప్ప పరిపాలన సౌలభ్యంగా ఉండదని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఒకచోట, సచివాలయం మరోచోట ఏర్పాటు చేయటం తల, మొండెం వేరు చేసినట్లు ఉంటుందని పేర్కొన్నారు. రాజధాని అమరావతి గురించి ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. రాజధానుల ఏర్పాటుపై అభిలపక్షం నిర్వహించాలని నారాయణ డిమాండ్ చేశారు.
previous post
next post