హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యకేసు నిందితుల అంత్యక్రియలు సోమవారం జరగనున్నాయి. దిశా హత్యాచారం కేసు నిందితుల మృతదేహాలకు గాంధీ ఆస్పత్రిలో రీ పోస్టుమార్టం నిర్వహించారు. ఎయిమ్స్ ఫోరెన్సిక్ విభాగం చీఫ్ డాక్టర్ సుధీర్ గుప్తా ఆధ్వర్యంలోని బృందం గాంధీ ఆస్పత్రిలో రీపోస్టు మార్టం నిర్వహించింది. సుమారు ఐదు గంటల పాటు ఈ ప్రక్రియ కొనసాగింది. రీ పోస్టుమార్టం ప్రక్రియను మొత్తం వీడియో తీశారు. నలుగురు నిందితుల రీ పోస్టుమార్టం నివేదికను ఎయిమ్స్ ఫోరెన్సిక్ విభాగం నిపుణు సీల్డ్ కవర్లో హైకోర్టుకు సమర్పిస్తారు.
పోస్టుమార్టం అనంతరం నలుగురి మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. ధృవీకరణ పత్రంపై కుటుంబ సభ్యులతో సంతకాలు చేయించుకొని.. అనంతరం అప్పగించారు. భారీ భద్రత నడుమ నిందితుల మృతదేహాలకు వారి స్వగ్రామాలకు తరలించారు. సాయంత్రం 5 గంటల తర్వాత అంత్యక్రియలు జరగనున్నాయి. 17 రోజులుగా కొనసాగిన అంత్యక్రియల సస్పెన్షన్ ఇవాళ జరిగే అంత్యక్రియలతో తెరపడనుంది. నలుగురు నిందితుల మృతదేహాలు 50శాతం కుళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఏ1 మహమ్మద్ ఆరిఫ్ శరీరంలో నాలుగు బుల్లెట్ గాయాలు, ఏ2 చెన్నకేశవులు శరీరంలో మూడు, నవీన్ శరీరంలో రెండు బుల్లెట్లు, శివ బాడీలో ఒక బుల్లెట్ గాయం ఉన్నట్టు సమాచారం.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘దిశ’ హత్యాచారం సంఘటనలో నిందితులైన మహ్మద్ ఆరీఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చింతకుంట చెన్నకేశవులు డిసెంబర్ 6న చటాన్పల్లి వద్ద జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన విషయం తెలిసిందే. అనంతరం మృతదేహాలకు మహబూబ్నగర్ జనరల్ ఆసుపత్రిలో పోస్ట్మార్టం అనంతరం అదే రోజు కుటుంబీకులకు అప్పగిస్తారని భావించినా, ఎన్కౌంటర్పై సందేహాలున్నాయంటూ రీపోస్ట్మార్టం కోరుతూ హైకోర్టులో మహిళా సంఘాల నేతలు పిటిషన్ దాఖలు చేయడంతో ఆరోజు మృతదేహాలను కుటుంబీకులకు అప్పగించలేదు. ఆ తర్వాత సుప్రీంకోర్టులో కేసు నమోదవడం, జాతీయ మానవ హక్కుల కమిషన్ విచారణ జరపడం, హైకోర్టులోని కేసులన్నింటిపైనా సుప్రీం స్టే విధించడం, ఎన్కౌంటర్పై ముగ్గురు సభ్యులతో విచారణ కమిషన్ ఏర్పాటవడం వంటి పరిణామాల నేపథ్యంలో మృతదేహాలను కూడా సికింద్రాబాద్లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు.
నిందితులు చనిపోయి 17 రోజులవుతున్నా అంత్యక్రియలు నిర్వహించలేదు. నిందితుల మృతదేహాలు 50 శాతం కుళ్లిపోయాయని గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ శ్రవణ్ హైకోర్టుకు తెలిపారు. దీంతో నిందితుల మృతదేహాలకు మళ్లీ పోస్ట్ మార్టం నిర్వహించాలని తెలంగాణ హైకోర్టు డిసెంబర్ 21న ఆదేశించింది. పోస్టుమార్టం అనంతరమే నిందితుల మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించాలని హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. కోర్టు ఆదేశాలతో రీపోస్ట్మార్టం అనంతరం మృతదేహాలను కుటుంబీకులకు అప్పగించారు.