కర్నూలు: రాయలసీమ ప్రాంతంలో హైకోర్టును పెట్టినంత మాత్రాన నీళ్లు, ఉద్యోగాలు వస్తాయా? అని మాజీ మంత్రి అఖిలప్రియ ప్రశ్నించారు. ఏపీకి మూడు రాజధానులు ప్రకటనపై ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. సీమ ప్రజలు కోరుకుంటున్నది నీళ్లు, పరిశ్రమలని అఖిలప్రియ స్పష్టం చేశారు. హైకోర్టును మంజూరు చేసి, సీమను ఉద్ధరించామని చెప్పవద్దని తెలిపారు. జగన్ కు చిత్తశుద్ధి ఉంటే, టీడీపీ పార్టీ చేపట్టిన అభివృద్ధి పథకాలను కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలన్నారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తే… ఇచ్ఛాపురం నుండి కర్నూల్కి వెయ్యి కిలోమీటర్ల దూరం అవుతుందంన్నారు. అలాగే విశాఖకు కర్నూలు నుంచి 800 కిలోమీటర్ల దూరం ఉందని… అందుకే అందరికీ అందుబాటులో ఉందనే అమరావతిని ఎంపిక చేశామన్నారు. కర్నూల్ కి హైకోర్టు ఒకదానితో ఒరిగేదేమీ లేదని అభిప్రాయపడ్డారు. అనాలోచిత నిర్ణయాలు తీసుకుని ప్రజల జీవితాలతో జగన్ ప్రభుత్వం ఆటలాడుతోందని అఖిలప్రియ విమర్శించారు.
ఏపీలో మూడు రాజధానుల ప్రతిపాదన ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా కాకరేపుతోంది. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలంటూ జీఎన్ రావు కమిటీ తన నివేదికలో పేర్కొంది. అయితే, ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకోకపోయినా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేయాలంటూ గత కొంతకాలంగా ఆందోళనలు నిర్వహిస్తోన్న న్యాయవాదులు, కొందరు నేతలు కమిటీ ప్రతిపాదనపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే, టీడీపీ నేతలు మాత్రం దీనిని తప్పుబడుతున్నారు.