విజయవాడ: ఉత్తరాంధ్ర దోపిడీకి వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని టిడిపి అధికారప్రతినిధి పంచుమర్తి అనురాధ ఆరోపించారు. వైసీపీకి కులరాజకీయాలు తప్ప.. అభివృద్ధి పట్టడం లేదని విమర్శించారు. సోమవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ అమరావతి బడుగు, బలహీనవర్గాల రాజధాని అని టీడీపీ నాయకురాలు అన్నారు. రాజధాని ఒక సామాజిక వర్గానిదని చెప్పి వైసీపీ నాయకులు విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. విశాఖలో ఏ సామాజికవర్గంతో వ్యాపారం చేస్తున్నారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునన్నారు. ‘అమరావతిలో నాలుగు వేల ఎకరాలు ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఎలా చెబుతారు ? నిజంగా ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని మీరు నిరూపిస్తే మేము రాజీనామా చేస్తాం. నిరూపించలేకపోతే మీరు రాజీనామా చేస్తారా? మా ఛాలెంజ్కు మీరు సిద్ధమా?’అని సవాల్ విసిరారు. రాజధానిలో 125 ఎకరాలు మాత్రమే రిజిస్ట్రేషన్లు జరిగాయని, మరి నాలుగు వేల ఎకరాల ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని ఆర్థిక మంత్రి బుగ్గన ఎలా చెబుతారని ప్రశ్నించారు.
చంద్రబాబునాయుడు ఒక విజన్ ఉన్న నాయకుడని, ఉత్తరాంధ్రను అభివృద్ధి చేయడంలో ముందున్న నేత అని గుర్తు చేశారు. తెలుగుదేశం హయాంలో వైజాగ్ను ఆర్థిక రాజధానిగా చేయటానికి అన్ని ప్రయత్నాలు సఫలీకృతం చేశారని తెలిపారు. జగన్మోహన్రెడ్డి క్యాంప్ ఆఫీస్ పెట్టాలనుకున్న మిలీనియం టవర్స్ చంద్రబాబు కట్టించినదేనని చెప్పారు. అదేవిధంగా అక్కడున్న లూలూ కంపెనీలు, అదానీ కంపెనీలు, పరిశ్రమలను తీసుకొచ్చారని తెలిపారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి నిధులు కేటాయించటం, తోటపల్లి రిజర్వాయర్ ద్వారా 90 వేల ఎకరాలకు నీరందించామని పేర్కొన్నారు. ఉత్తరాంధ్రతోపాటు 13 జిల్లాల ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, మొబైల్ ఫోన్ల తయారీ, ఆక్వా కల్చర్, ఆటో మొబైల్స్ తీసుకువచ్చారని తెలిపారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో లావా అవంతి సీడ్స్, పతాంజలి, జయ్ ఇరిగేషన్, పార్లే, జెర్సీ ఇండస్ట్రిస్ గ్రూప్, టాటా ఫ్రూట్స్, ఐటిసి ఇంకా మరిన్ని పరిశ్రమలు వచ్చాయని గుర్తు చేశారు.
ఫార్మా రంగంలో స్పైరా హెల్త్ కేర్, డాక్టర్ రెడ్డి ల్యాబ్స్, లూపిన్స్, అరవింద ఫార్మా, దివి ల్యాబ్స్, నాట్కో ఫార్మా తదితర కంపెనీలు కూడా టీడీపీ హయంలో వచ్చాయని తెలిపారు. కృష్ణపట్నం, ఓర్వకల్లు, హిందూపురం నియోజకవర్గాల్లో సీబీఐసీ కింద మూడు పారిశ్రామిక రోడ్లను అభివృద్ధి చేశామన్నారు. విశాఖపట్నం, శ్రీకాళహస్తి, మచిలీపట్నం, దొనకొండ ఈ నాలుగు చోట్ల పారిశ్రామిక అభివృద్ధిని తీసుకురావటానికి కృషి చేశామన్నారు. నెల్లూరు, ప్రకాశం జిల్లాలలో ఫుడ్ పార్కులు… కడప, చిత్తూరు జిల్లాలలో సమీకృత ఫుడ్ పార్కులు ఏర్పాటు చేశామన్నారు. కడప జిల్లాలో స్టీల్ ప్లాంటుతోపాటు మెగా పారిశ్రామిక పార్కు కోసం 6,553 ఎకరాలు సేకరించినట్లు పంచుమర్తి అనురాధ తెలిపారు.
టీడీపీ ప్రభుత్వం 13 జిల్లాల అభివృద్ధినికాంక్షించి 60 శాతం పనులు పూర్తి చేస్తే.. కేవలం మీ వ్యాపారాల కోసం మూడు చోట్ల రాజధానులు పెడతారా? అని అనురాధ మండిపడ్డారు. ఉత్తరాంధ్రలో లక్ష్యం టైటానియం అని వ్యాఖ్యానించారు. ఏదైతే న్యూక్లియర్ బాంబులో ఉపయోగించే పదార్థాన్ని అమ్ముకోవటం కోసం కెవిపి రామచంద్రరావు, కోనేరు ప్రసాద్, జగన్మోహన్రెడ్డి బినామీలు అందరూ కూడా అందులో ఉన్నారని ఆరోపించారు. దీనికి సంబంధించి కేవీపీ రామచంద్రరావుకు అంతర్జాతీయ ఇంటర్పోల్ వాళ్ల నోటీసు ఇస్తే స్టే తెచ్చుకొని దాక్కొని ఉన్నారని తెలిపారు. జగన్మోహన్రెడ్డి మిత్రుడిని విదేశాల్లో అరెస్టు చేశారన్నారు. ఉత్తరాంధ్రను రౌడీయిజం, దౌర్జన్యం, దగా చేసి దోచుకోవాలని వైసీపీ నాయకులు ప్రయత్నం చేస్తున్నారని పంచుమర్తి అనురాధ ధ్వజమెత్తారు. కులమంటే అంటని ప్రాంతం విశాఖపట్నం అని, అందుకనే విజయలక్ష్మిని ఓడించారన్నారు. విజయవాడతో పోల్చిస్తే విశాఖపట్నం పది రేట్లు ఆర్థికంగా అభివృద్ధి చెందిన ప్రాంతం అని చెప్పారు. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలని వైసీపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. రెండు కుర్చీలు, రెండు బేంచీలు వేసి ఎగ్జిక్యూటివ్ రాజధాని అంటూ నాశనం చేయటానికి వైసీపీ కంకణం కట్టుకుని ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎగ్జిక్యూటివ్ రాజధాని వల్ల ఎటువంటి ప్రయోజనం లేదన్నారు. అమరావతిలోని రాజధాని ప్రజల ఆందోళన కూడా ప్రభుత్వం అర్థం చేసుకోవాలని బ పంచుమర్తి అనురాధ కోరారు.