(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
ఆంధ్రప్రదేశ్ రాజధాని వివాదంలో బిజెపి, జనసేన ఎలాంటి వైఖరి అవలంబించబోతున్నాయి? ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు గమనించేవారందరూ ఈ ప్రశ్నకు సమాధానం వెదుకుతున్నారు. నిజానికి బిజెపి, జనసేన తమ వైఖరి స్పష్టం చేయకపోలేదు. రాజధానిగా అమరావతి కొనసాగాలనీ, మార్చాలన్న వైసిపి ప్రభుత్వ ప్రయత్నాలను ఎదుర్కొంటామనీ ఆ రెండు పార్టీలూ చెప్పాయి. అయినా బిజెపి, జనసేన వైఖరి విషయంలో ప్రజలు అనుమానపడుతూనే ఉన్నారు.
రాజధాని వివాదం రగులుతున్న తరుణంలో బిజెపి, జనసేన కలిసి పని చేయాలని నిర్ణయించాయి. రాజధాని వివాదమే ఆ రెండు పార్టీలనూ పొత్తు వైపు నడిపిందని ప్రజలు భావించారు. దానికి తోడు ముందు జనసేన అధినేత పవన్ కల్యాణ్ అమరావతి పక్షాన గట్టిగా నిలబడ్డారు. రాజధాని గ్రామాల్లో ఒకసారి పర్యటించి అక్కడి రైతులకు ధైర్యం చెప్పారు. ఈ నేపధ్యంలో బిజెపి, జనసేన కలిసి నడవాలని నిర్ణయించాయి.
అయితే ఆ తర్వాత ఉభయపక్షాల నుంచీ గంభీరమైన మాటలు వినవస్తున్నాయి కానీ చేతలు కనబడడం లేదు. రాష్ట్రం మొత్తం రాజధాని తరలింపు గురించి మాట్లాడుకుంటుండగా బిజెపి పెద్దలను కలిసేందుకు ఢిల్లీ వెళ్లిన పవన్ కల్యాణ్, మిత్రపక్షంతో కలిసి ఫిబ్రవరి రెండవ తేదీన రాజధానికి లాంగ్మార్చ్ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. నెల రోజులకు పైగా చావోరేవో అన్నట్లు రాజధాని ప్రాంత రైతులు దీక్షలు చేస్తుండగా మరో పది రోజుల తర్వాత తమ ఆందోళన కార్యక్రమం మొదలవుతుందని బిజెపి-జనసేన ప్రకటించడం వారి ఆంతర్యం ఏమిటన్న ప్రశ్నకు తావిచ్చింది.
బిజెపి పెద్దలతో మాట్లాడుకున్న తర్వాతనే ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మూడు రాజధానుల కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్న అభిప్రాయం ముందే కొందరిలో ఉంది. బిజెపి నాయకులు దానిని ఖంఢిస్తున్నప్పటికీ, కేంద్రం జోక్యం చేసుకోబోదన్న మాట కూడా వారి నోటి నుంచే రావడంతో ఆ అనుమానాలు బలపడుతున్నాయి. మూడు రాజధానులకు కేంద్రంలోని బిజెపి పెద్దల ఆశీస్సులు లేకపోయినా గానీ వారికి నవ్యాంధ్రలో తమ పార్టీ ఎదుగుదల అన్నిటికన్నా ముఖ్యమన్న విషయంలో ఎవరికీ అనుమానాలు లేవు.
ఆ కారణంగా రాష్ట్రంలో పరిస్థితులు మరింత క్షీణించడాన్నే బిజెపి కోరుకుంటుందనీ, అప్పటివరకూ ప్రత్యక్ష జోక్యం ఉండదనీ భావిస్తున్నారు. రాజకీయ పరిశీలకుల అంచనాల ప్రకారం ముందు టిడిపి బలహీనపడేవరకూ బిజెపి వేచిచూస్తుంది. తర్వాత వైసిపి సంగతి చూస్తుంది. పవన్ కల్యాణ్ బిజెపితో జత కట్టారు కాబట్టి ఆయన కూడా అదే లైను తీసుకోక తప్పదు. ఈ లోపు మరి రాజధాని ఉద్యమంలో పాలు పంచుకుంటానన్న ఆయన మాట సంగతేమిటి?s ప్రస్తుతానికి అది ప్రకటనలకు పరిమితం అవుతుందని అంటున్నారు.