ఆదిలాబాద్: తెలంగాణలో సంచలనం రేపిన సమత కేసులో ఆదిలాబాద్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఈ కేసులో ముగ్గురు నిందితులకూ ఉరిశిక్షను విధిస్తున్నట్లు గురువారం ప్రకటించింది. ఈ కేసుకు సంబంధించి ఈ నెల 20న వాదనలు పూర్తి కాగా ఈరోజు తీర్పు చెప్పింది. న్యాయమూర్తి ఉరిశిక్షను ఖరారు చేయగానే దోషులు షేక్ బాబు, షాబుద్దీన్, ముగ్దుమ్ కన్నీళ్లు పెట్టుకున్నారు. శిక్ష విషయంలో కనికరం చూపాలని నిందితులు వేడుకున్నారు. “మీరు చేసిన పని చాలా ఘోరమైనది” అని న్యాయమూర్తి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
ముందుగా.. నిందితులను జైలు అధికారులు కోర్టులో ప్రవేశపెట్టగా.. కోర్టు హాలులోకి పిలిచిన జడ్జి వారి కుటుంబ వివరాలను అడిగి తెలుసుకున్నారు. నేరం రుజువైందని నిందితులకు చెప్పారు. ‘మీరు ఏమైనా చెప్పుకునేది ఉందా?’ అని నిందితులను న్యాయమూర్తి అడిగారు. దీంతో ప్రధాన నిందితుడు షేక్ బాబు కంటతడి పెట్టాడు. నిందితుల తరపున వాదనలు వినిపించిన న్యాయవాది రహీం.. శిక్ష తగ్గించాలని కోర్డును కోరారు. కుటుంబానికి తామే ఆధారమంటూ న్యాయమూర్తి ముందు నిందితులు కన్నీరు పెట్టుకున్నారు. ముగ్గురు నిందితులకు నలుగురు పిల్లలురున్నారని, శిక్ష తగ్గించాలని కోరారు. గురువారం(జనవరి 30) ఆదిలాబాద్ కోర్టు నిందితులకు ఉరిశిక్ష విధించడంతో బాధిత కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. సమత భర్త గోపి, కుటుంబ సభ్యులతోపాటు సమత స్వగ్రామం గోనంపల్లె వాసులు సైతం కోర్టుకు భారీగా వచ్చారు. తీర్పు నేపథ్యంలో కోర్టు దగ్గర పోలీసులను భారీగా మోహరించారు.
గతేడాది నవంబర్ 24న కుమ్రం భీం జిల్లాలో లింగాపూర్ శివారులో సమతపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారం జరిపి హత్య చేసిన విషయం తెలిసిందే. గ్రామాల్లో సంచరిస్తూ బెలూన్లు అమ్ముకుంటూ జీవనం సాగించే బాధితురాలు ఒంటరిగా ఉండటం గమనించి ముగ్గురు వ్యక్తులు 2019 నవంబర్ 24న ఆమెను అపహరించారు. చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి సామూహిక హత్యాచారం చేశారు. నవంబరు 25న ఆమె మృతదేహం లభ్యమైంది. మృతదేహంపై పలు చోట్ల బలమైన గాయాలు కనిపించాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు రేపిన ఈ కేసు విచారణను తీవ్రంగా పరిగణించిన పోలీసులు 20 రోజుల్లోనే దర్యాప్తు పూర్తి చేశారు. ఈ కేసుకు సంబంధించి ముగ్గురు నిందితులు షేక్ బాబా, షేక్ షాబుద్దీన్, షేక్ ముగ్దుమ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. డిసెంబర్ 14న ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఈ ఘటనపై ప్రజల్లో ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. దిశ నిందితులను ఎన్ కౌంటర్ చేసినట్లు వీరిని కూడా ఎన్ కౌంటర్ చేయాలనే డిమాండ్ కూడా వినిపిచింది.
ఈ కేసులో ఏ1గా షేక్బాబు(30), ఏ2గా షేక్ షాబొద్దీన్(40), ఏ3గా షేక్ ముగ్దుమ్(30) పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసు విచారణకు డిసెంబర్ 11న ఆదిలాబాద్లో ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేశారు. ఈ కేసులో డిసెంబర్ 14న ఛార్జిషీటును ఫాస్ట్ట్రాక్ కోర్టులో పోలీసులు దాఖలు చేశారు. డిసెంబర్ 31న కోర్టు విచారణ పూర్తి చేసింది. జనవరి 20న ప్రాసిక్యూషన్, డిఫెన్స్ లాయర్ల మధ్య వాదనలు ముగిశాయి. అయితే ఈ కేసు తీర్పు జనవరి 27న వెల్లడించాల్సి ఉంది. అయితే న్యాయమూర్తి అనారోగ్యం కారణంగా జనవరి 30కు వాయిదా వేసింది. సమతను కత్తితో పొడిచిన సమయంలో ఆమె చేతి వేళ్లపై, మెడపై, ఇతర శరీర భాగాలపై కత్తి గాయాలయ్యాయి. నిందితులు వాడింది కోళ్లు కోసే కత్తి అని.. దీని పొడవు 29 సెంటిమీటర్లు అని పోలీసులు గుర్తించారు. నిందితుల క్రూరత్వం గురించి పోలీసులు సాక్ష్యాధారాలతో సహా ఆదిలాబాద్లోని ఫాస్ట్ట్రాక్ కోర్టులో మొత్తం 96 పేజీల నివేదికను సమర్పించారు. 44 మంది సాక్షుల వాంగ్మూలాన్ని నమోదు చేయడంతో పాటు శాస్త్రీయ ఆధారాలతో కూడిన ఫోరెన్సిక్, డీఎన్ఏ నివేదికల్ని పొందుపరిచారు.
ఈ అమానవీయ ఘటనపై స్పందించిన ఆదిలాబాద్ బార్ అసోసియేషన్ సభ్యులు నిందితుల తరపున వాదించబోమని ఏకగ్రీవ తీర్మానం చేశారు. అందుకు అనుగుణంగానే న్యాయవాదులెవరూ ముందుకు రాలేదు. ఫాస్ట్ట్రాక్ కోర్టులో విచారణ ప్రారంభమైన నేపథ్యంలో నిందితుల తరపున వాదించేందుకు న్యాయవాదులు ఎవరూ ముందుకు రాకపోవడంతో కోర్టు జోక్యం చేసుకుంది. జిల్లా న్యాయసేవాధికార సంస్థ నుంచి నిందితుల తరపున వాదించడానికి కోర్టు న్యాయవాదిని నియమించింది. సీనియర్ న్యాయవాది ఏ.ఏ. రహీం నిందితుల తరపున వాదించారు. నిందితుల తరపున వాదించొద్దని బార్ అసోసియేషన్ తీర్మానించినప్పటికీ కోర్టు ఆదేశాల మేరకు అంగీకరించాల్సి వచ్చిందని రహీం పేర్కొన్నారు.