గుంటూరు: ఇటీవల ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన డొక్కా మాణిక్యవరప్రసాద్ తెలుగుదేశం పార్టీకి దూరం అవుతున్నారా? అంటే ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలు అందుకు బలం చేకూరుస్తున్నాయి. సిఆర్డిఏ రద్దు, వికేంద్రీకరణ బిల్లులు మండలికి వచ్చిన కీలక సమయంలో అనూహ్యంగా మాణిక్య వరప్రసాద్ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి పార్టీని దిగ్భంతికి గురి చేశారు. నేడు ఆయన చేసిన సంచలన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతున్నాయి.
టిడిపి ఆలోచన విధానం తనకు నచ్చడం లేదన్న మాణిక్య వరప్రసాద్ పార్టీ ఆలోచన, తన వ్యక్తిగత ఆలోచనలకు భిన్నంగా ఉన్నాయని చెప్పుకొచ్చారు. అందుకే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశానని తెలిపారు. మండలిలో జరుగుతున్న పరిణామాలు, మండలి రద్దు నిర్ణయం దురదృష్టకరమని అన్నారు. వ్యక్తుల మీద కక్షతో వ్యవస్థలను రద్దు చేయడం సరికాదని డొక్కా అభిప్రాయపడ్డారు. అమరావతి రైతుల బాధలను స్వయంగా చూశాననీ, వారికి అండగా ఉంటాననీ ఆయన హామీ ఇచ్చారు. మిగతా విషయాలు అన్ని త్వరలోనే తెలుస్తాయంటూ సస్పెన్స్కు తెరలేపారు.