వర్తమాన చరిత్రను పునర్లిఖించమని మీడియా గురజాడలెవరూ మన ఆధునిక మీడియా ప్రముఖులను కోరిన దాఖలాలు లేవు. అయినా అటువంటి గురుతర బాధ్యతను తమ భుజస్కంధాలపై తెలుగు ఛానళ్లు తమకు తెలియకుండానే మోస్తున్నాయా అని సందేహం కలుగుతోంది. ఏరోజు కారోజు మీడియాలో స్వైరవిహారం చేసే ఏ అంశమైనా పరిశీలించండి, దీనికి సంబంధించిన వార్తలు, వ్యాఖ్యానాలు, విమర్శలూ, హరికథలూ గమనించండి, బోధపడుతుంది.
కడప జిల్లాకు చెందిన వై.ఎస్.వివేకానంద రెడ్డి మరణవార్త చాలా ఉదయమే వెలువడింది. దాని తర్వాత వివిధ ఛానళ్ల వార్తలు, వ్యాఖ్యలు, విశ్లేషణలు చెప్పనలవి కాదు. అప్పటికి ఎన్నికల పోలింగ్ తేదీ ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్లో శాసనసభ, లోక్సభ ఎన్నికలు జరుగుతాయి, తొలివిడత లోనే. ఎక్కువ సమయం లేదు. రాజకీయపార్టీల కార్యాలయాల కన్నా ఛానళ్ల ఆఫీసులలోనే హడావుడి ఎక్కువగా ఉందా అనిపిస్తోంది.
సమాచారం సేకరించి, దానికి సంబంధించి అందుబాటులో ఉన్న వర్తమాన చరిత్రను పరిశీలించి వార్తగా మలుస్తారు. టెలివిజన్లో దృశ్యం ప్రధానం. మౌఖిక సమాచారం అనుషంగికం. కనుక కెమెరా ఆధారంగా తయారయిన విశేషాలు ప్రధానంగా ఉండాలి. కెమెరా చెప్పజాలని సంగతులను వాచ్యంగా దృశ్యానికి జోడించాలి. ఇదీ స్థూలంగా టెలివిజన్ జర్నలిజం డిమాడ్ చేసే మేళవింపు. అయితే నడుస్తున్న టెలివిజన్ ఛానళ్ల వార్తల తీరు వ్యవహారం మరోలా ఉంటోంది. కొంత సమాచారం రాగానే దానికి తమ సంస్థ పాలసీకి తగిన ధోరణిలో మిగతా విషయాలు కలిపి కార్యక్రమాలు సాగుతున్నాయి. టివి స్టూడియోలో ఇద్దరుముగ్గురు అంశాల నిపుణులు ఉంటారు. టెలిఫోన్ లైన్లో ఛానల్ ప్రతినిధి ఉంటాడు. యాంకర్ చెవిలో ఛానల్ పాలసీ తాలూకూ సూచనలు నిరంతరాయంగా అందుతుంటాయి. అంతే, ఈ పరిమిత వనరులతో పద్దెనిమిది గంటల ప్రసారాన్ని ఒకే వార్తావాహినిగా రూపాంతరం చెందించగలరు.
వారం క్రితం డేటా చోరీ గురించి సాక్షి ఛానల్లో ఫోర్త్ ఎస్టేట్ కార్యక్రమం లైవ్ సాగుతోంది. ఈ తతంగం క్షేత్రస్థాయిలో ఎలా ఉంటోంది, ఏ రకంగా ఉపయోగించుకుంటున్నారు అని ఛానల్ యాంకర్ అడిగితే విశాఖపట్నం నుంచి ఒక నాయకుడు సాధికారికంగా సహేతుకంగా వివరిస్తున్నాడు. యాంకర్ అడ్డుతగిలి, పార్టీ మనిషిలా ప్రశ్నలు కురిపించాడు. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను అడగాల్సిన ప్రశ్నను ఆయన మీద తోసి ఆయన చెప్పగలిగిన విషయం వెలికిరాకుండా కృషి చేశాడు. టివి9లో కె.ఎ.పాల్ను లైవ్లో నాలుగు ప్రశ్నలు ఒకేసారి అడిగి ఆయన సరిగా నాలుగు మాటాలు మాట్లాడే లోపు మరో రెండు ప్రశ్నలు వేశాడు. కె.ఎ.పాల్ మాట్లాడేది సమ్మతమా, సహేతుకమా అన్నది వేరే విషయం. టిఆర్పి కోసం మీరు అతనిని ఆహ్వానించారు. ఆయన తేగల టిఆర్పిలు యాంకర్ ఒక్కడే తేలేడు. ఇది గమనించకుండా ఇష్టారాజ్యంగా కార్యక్రమం సాగదీయడం, తమకు లాభం చేకూరుతుందన్న రీతిలో ముందుకు పోగడం ఇప్పుడు అలవాటుగా స్థిరపడిపోతోంది.
సహనం, నమ్రత, జిజ్ఞాస, మానవీయ విలువల పట్ల గౌరవం లేకుండా ఛానళ్లు సున్నితత్వ రాహిత్యంలో తలమునకలవుతున్నాయి.
డా. నాగసూరి వేణుగోపాల్