అంటువ్యాధి అనేది నిన్ననో మొన్ననో మొదలైన విషయం కాదు. చరిత్రలోని అత్యంత ప్రాచీనమైన నాగరికతలు, అంటువ్యాధుల కారణంగానే అంతరించిపోయాయని కొందరు చరిత్రకారుల నమ్మకం. ఉదాహరణకి, రోమన్ నాగరికత విషయమే తీసుకోండి- రోమ్ నాగరికులకు తెలిసిన లోహం సీసం ఒక్కటేనని కొందరు చరిత్రకారులు అంటారు. సీసపు గొట్టాల లోంచి, తాగే నీరు ప్రవహించడం వల్లనే రోమ్లో అంటువ్యాధులు ప్రబలాయనీ, పర్యవసానంగా రోమన్ నాగరికత అంతరించి పోయిందనీ వాళ్ళ సిద్ధాంతం.
దీన్ని బట్టి మనకి ఓ విషయం తెలుస్తోంది. అభివృద్ధి చెందేశామని మనం అనుకునే సందర్భాల్లో కూడా ప్రాణాంతకమైన ముప్పు పొంచివుంటుంది! పందొమ్మిదివందల తొంభై దశకంలో మన దేశంలో సాంకేతిక విప్లవం సంభవించిందని, దాని పుణ్యమాని దేశం పెద్ద ముందడుగు వేసిందని -తాజా ఎన్నికల నేపథ్యం లో- కొందరు సాంకేతిక మాంత్రికులు వెల్లడించారు ఈ మధ్య. అలాంటి పురాణ కాలక్షేపం చెయ్యడం మన మీడియా ప్రముఖులు కొందరిలో కూడా చూస్తూఉంటాం మనం.
వాస్తవం మరీ అంత విప్లవాత్మకంగా లేదు మరి!
రాజకీయ జంతువులతో రాసుకు పూసుకు తిరిగే ఈ మీడియా గురువులూ, లఘువులూ, తమ నాగరిక లక్షణాలు ఆ జంతువులకు నేర్పడానికి బదులుగా వాళ్ళ దగ్గిరనుంచి బ్లాక్మెయిల్, బెదిరింపు, కుమ్మక్కు, చెక్కభజన, చంచాగిరీ తాము నేర్చుకోవడం మనలో ప్రతి ఒక్కరికీ తెలిసిన రహస్యమే! ఇలాంటి మీడియా గురువులూ, లఘువులూ మెరుగైన సమాజాన్ని సృష్టించకపోగా “మురుగైన మీడియాని” మాత్రం జయప్రదంగా సృష్టించారన్నది సైతం అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే!
అంతగా బహిరంగం కానీ మరో రహస్యం ఇంకొకటుంది.
కార్పొరేట్ సంస్కృతి ఒంటబట్టించుకున్న ఈ మురుగు మీడియా, అందులోని నీచత్వాన్ని సైతం ఒళ్ళంతా పులుముకుంది. జర్నలిస్టులకి చెంచాడు స్టాక్ ఆప్షన్ ప్రసాదం పెట్టి, వాళ్ళను పెట్టుబడిదార్లుగా మార్చేస్తున్నట్లు పోజులు విసరడం ఈ మురుగు మీడియా గురువులూ, లఘువుల సామాన్య లక్షణం. అక్కడితో కథ అయిపోలేదు. డబ్బుకి లోకం ఎలాగూ దాసోహమే కనుక, స్టాక్ ఆప్షన్ ప్రసాదం పుచ్చుకున్న మీడియా ఉద్యోగుల చేత, ఫోర్జెరీలు రీళ్ళకు రీళ్లు చుట్టిపించడానికి సైతం తెగించారు కొందరు సంఘ సంస్కర్తలు!
పైపైన చూస్తే ఈ పరిణామాల మధ్యన ఉన్న లంకె మనకళ్ళకి కనబడదు.
మన దేశం స్వతంత్రం కావడానికి దశాబ్దాల కిందటే మన మీడియా ఒక మేరకి స్వతంత్రమయింది. రవి అస్తమించని వలసవాదాన్ని గడగడలాడించింది ఆనాటి మీడియా. తిలక్, గాంధీ, నెహ్రు, ప్రకాశం తదితరులు కార్పొరేట్ కాకిఈకలు తగిలించుకోకుండానే తాము చెయ్యాలనుకున్న పనులు బ్రహ్మాండంగా చేశారు. తాము స్వయంగా రాజకీయ నాయకులం అయివున్నప్పటికీ ఆ రంగం తాలూకు అరాజకత్వాన్ని మీడియాలోకి లాక్కురాలేదు వాళ్ళెవరూ. ఖాసా సుబ్బారావుకి, కోటంరాజు రామారావుకి, ఎం.చలపతిరావుకీ, రాఘవాచారికీ, వరదాచారికీ ఎవరూ స్టాక్ ఆప్షన్ తాయిలాలు ఇచ్చినట్లు ఎక్కడా వినలేదు మరి. ఈ పెద్దలు మీడియా స్వతంత్ర – నిష్పాక్షిక స్వభావాన్ని నిలబెట్టడం మాత్రమే కాకుండా, ఎడిటోరియల్ స్వయంప్రతిపత్తిని సైతం ఆకాశంలో నిలబెట్టారని మనలో కొందరికైనా తెలుసు.
వీళ్ళకి కార్పొరేట్ అంటువ్యాధులు, రాజకీయ చర్మవ్యాధులు సోకక పోవడానికి కారణం ఏమిటో మన “మురుగు మీడియా” గురు-లఘువులకి ఎప్పటికైనా అర్థం అవుతుందా? కాదనే ప్రగాఢ విశ్వాసంతో, నేనే ఆ కారణం ఏమిటో విన్నవిస్తున్నా- చిత్తగించండి!
మన ప్రపంచం లో అంటూ వ్యాధులు సోకని ప్రాంతం లేదు. అయితే, ఈ వ్యాధులు, అందరికీ అంటుకునే ప్రమాదం ఉన్నట్లయితే, ఆయా ప్రాంతాల్లో ఉండిన జనం మొత్తంగా తుడిచిపెట్టుకు పోవాలి కదా? అలా జరిగిందా మరి? లేదు! రోగనిరోధక శక్తి ఉన్నకొద్దిమంది ఈ భయంకరమైన అంటువ్యాధుల్ని సైతం తట్టుకుని నిలబడ్డారని చరిత్ర చెప్తోంది. అంతేకాదు- వైద్యం, ఔషధాల తయారీ, అత్యాధునిక శస్త్రచికిత్సల సాంకేతిక పరిజ్ఞానం మానవాళికి అందుబాటులోకి రాని రోజుల్లో రోగనిరోధక శక్తి మెరుగైన ప్రమాణాలతో ఉండేదని కూడా చరిత్ర చెప్తోంది.
అనగా- మన మురుగు మీడియా గురులఘువుల లోపం ఏమనగా, రోగనిరోధక శక్తికి నోచుకోక పోవడమే. ఎన్నికల్లో ఖర్చు పెట్టడం కోసమని మన అరాజకీయులు వందలు-వేలు-లక్షల కోట్ల అక్రమార్జనకు పాల్పడుతుంటే, వాళ్ళని చూసి మన మురుగు మీడియా గురులఘువులు కొన్ని తరాలు కూర్చుని తినడానికి- మరియు తాగడానికి- సరిపోయేంత సొమ్ములు నొల్లుకోవడానికి తెగబడుతున్నారు.
నికార్సైన “చౌకీదార్ చోర్ హై” అంఘటన ఇది.
“మన ముఖారవిందం ఎంత సుందర ముదనష్టంగా ఉందో చూసుకోవడానికి మనం అద్ధం ముందు నిలబడతాం; మన ఆత్మసౌందర్యం ఏపాటిదో తెలుసుకోవడానికి కళాకృతుల ముందు నిలబడతా”మని అన్నాడట బెర్నార్డ్ షా.
మన మురుగు మీడియా, మన అరాజకీయ వ్యవస్థ ముఖారవిందాన్ని అద్దంలా ప్రతిఫలిస్తోందా? లేక మన సమాజం ఆత్మ సౌందర్యాన్ని ప్రతిబింబిస్తోందా?
నా కన్నా మీకే బాగా తెలుసు, ఈ ప్రశ్నకి జవాబు!
-మందలపర్తి కిషోర్
ఎల్లో జర్నలిజం నడుమ జాతీయ పత్రికా దినోత్సవం…పత్రికా స్వేచ్ఛ ఒక భ్రమ