అమరావతి: రాజధాని అమరావతి ప్రాంతంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆరోపణలపై కేసు నమోదు చేసిన ఏపి సీఐడీ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఇప్పటికే మాజీ మంత్రులు నారాయణ, పత్తిపాటి పుల్లారావు పై కేసులను నమోదు చేసిన సీఐడీ అధికారులు తాజాగా మరో అయిదు గురిపై కేసులు నమోదు చేశారు. కృష్ణా జిల్లా విజయవాడ, పెనమలూరు, పోరంకి, యనమలకుదురు ప్రాంతాలకు చెందిన వారిపై కేసులు నమోదయ్యాయి. తప్పుడు పత్రాల ద్వారా తెల్ల రేషన్ కార్డులు పొందిన వీరంతా రాజధాని ప్రాంతంలో కోట్లాది రూపాయలు వెచ్చించి భూములు కొన్నారని కేసులు నమోదు చేశారు.
మరోవైపు అమరావతి ప్రాంతంలో అసైన్డ్ భూములను కొనుగోలు చేసిన 106 మంది జాబితాను మరోసారి ఐటీ శాఖకు సీఐడీ అధికారులు పంపించారు. అసైన్డ్ భూములను కొన్నవారితో పాటు, రెండు లక్షలకు పైగా మొత్తాలను నగదు రూపంలో చెల్లించిన వారి వివరాలను కూడా ఐటీ శాఖకు అందజేశారు. అంతేకాకుండా విలువైన ఆస్తులను కలిగి ఉండి నిబంధనలకు విరుద్ధంగా తెల్ల రేషన్ కార్డులను పొందిన వారి రేషన్ కార్డులను రద్దు చేయాలని కృష్ణా జిల్లా కలెక్టర్ ను సీఐడీ అధికారులు కోరారు.
సిఐడి అధికారులు ఇన్ సైడర్ ట్రేడింగ్ పై దర్యాప్తును ముమ్మరం చేయడంతో భూముల కొనుగోలు దారులు, బినామీ లావాదేవీలు నిర్వహించిన వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.