న్యూఢిల్లీ : దేశ రాజధాని డిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ప్రజలు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గాలున్న డిల్లీలో 1.47కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 81,05236 మంది పురుషులు కాగా, 66,80,277 మంది స్త్రీలు. మొత్తం 672 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.
2015లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 70 స్థానాల్లో 67 సీట్లలో ఆమ్ ఆద్మీ పార్టీ విజయఢంకా మోగించింది. కాంగ్రెస్, బిజెపి పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. అయితే 2019 లోక్సభ ఎన్నికల్లో మాత్రం బిజెపి క్లీన్స్వీప్ చేసింది. ఈసారి కాంగ్రెస్ పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదని విశ్లేషణలు చెబుతున్నారు. చాలా చోట్ల ఆప్నకు లబ్ధి చేకూరేలా బలహీనమైన అభ్యర్థుల్ని నిలిపిందన్న వార్తలు వచ్చాయి. మరోవైపు లోక్సభ ఎన్నికల ఫలితాలే పునరావృతం చేయాలని బిజెపి ఆశిస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రజలు తమ తీర్పును ఎవరి పక్షాన ఇవ్వనున్నారనేది ఆసక్తిగా మారింది.
సాయుధ పోలీసుల పహరా మధ్య పోలింగ్
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 190 కంపెనీల కేంద్ర పారామిలటరీ దళాలను మోహరించారు. పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా 42 వేల ఢిల్లీ పోలీసులు, 19వేల హోంగార్డులను పోలింగ్ కేంద్రాల వద్ద మోహరించారు. 190 కంపెనీల కేంద్ర సాయుధ బలగాలతో పెట్రోలింగ్ చేస్తున్నామని ఢిల్లీ పోలీసు ఇంటలిజెన్స్ స్పెషల్ కమిషనర్ ప్రవీర్ రంజన్ చెప్పారు. అసోం రైఫిల్స్, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సెంట్రల్ ఇండస్ట్రియల్ ఫోర్స్, కేంద్ర రిజర్వు ఫోర్స్, ఇండో టిబెటన్ బార్డర్ పోలీసు, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్, సహస్ర సీమాబల్ జవాన్ లు పోలింగ్ సందర్భంగా విధులు నిర్వహిస్తున్నారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు సాగుతున్న షహీన్ బాగ్ తో పాటు అయిదు పోలింగ్ కేంద్రాలను సున్నిత కేంద్రాలుగా గుర్తించిన ఎన్నికల అధికారులు భారీ బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీలో 47 కంపెనీల కేంద్రపారామిలటరీ బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేయగా, ఈ సారి ఎన్నికల్లో నాలుగు రెట్లు బందోబస్తు పెంచారు. 3141 పోలింగ్ కేంద్రాల్లో 144 కేంద్రాలు సమస్యాత్మకంగా గుర్తించి అదనపు బందోబస్తు ఏర్పాటు చేశారు.