న్యూఢిల్లీ: ఒక్కసారి పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైతే చాలు… ఇక ఆదాయానికి లోటుండదని అంటారు. ఆ సంగతేమో గానీ, దేశవ్యాప్తంగా ఉన్న ఎంపీలందరిలో అత్యధిక ఆదాయం ఉన్నది మాత్రం ఆంధ్రప్రదేశ్ ఎంపీలకేనట. ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్న 19 మంది సిట్టింగ్ ఎంపీలకు సగటున రూ. 1.06 కోట్ల ఆదాయం ఉందని చూపించారు. అదే మిగిలిన 479 మంది లోక్ సభ సభ్యులకు మాత్రం సగటు వార్షికాదాయం రూ. 30.29 లక్షలు మాత్రమే కావడం గమనార్హం. ఈ విషయం నేషనల్ ఎలక్షన్ వాచ్, అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫామ్స్ విడుదల చేసిన నివేదికలో ఉంది.
ఆంధ్రప్రదేశ్ తర్వాత అత్యధిక ఆదాయం ఉన్నవాళ్లు ఒడిశా ఎంపీలు. అక్కడి 15 మంది సగటు వార్షికాదాయం రూ. 68.8 లక్షలు. 2014 లోక్ సభ ఎన్నికలకు ముందు 521 మంది ఎంపీలలో 479 మంది తమ ఆదాయ వివరాలను ఎన్నికల కమిషన్ ముందు అఫిడవిట్ల ద్వారా తెలిపారు. మిగిలిన 42 మంది తమ ఆదాయం ఎంతో చెప్పలేదు. సమర్పించినవారిలో 58 మంది మహిళలు కూడా ఉన్నారు. పురుష ఎంపీల సగటు వార్షికాదాయం రూ. 30.54 లక్షలుగా ఉంటే, మహిళల వార్షికాదాయం సగటున రూ. 28.46 లక్షలుగా ఉంది.
మొత్తం 479 మందిలో 98 మంది వ్యాపారం చేస్తుండగా, మరో 91 మంది రైతులమని చెప్పారు. 16 మంది ఎంపీలు నటులు, గాయకులు లేదా దర్శక నిర్మాతలు. అత్యధికంగా వీరికి మాత్రం రూ. 1.06 కోట్లుగా ఆదాయం ఉంది. వ్యవసాయం లేదా వ్యాపారం తమ వృత్తిగా పేర్కొన్న 40 మంది ఎంపీల సగటు వార్షికాదాయం రూ. 75.24 లక్షలతో రెండోస్థానంలో ఉన్నారు. గోవాకు చెందిన ఇద్దరు ఎంపీలు అత్యల్పంగా రూ. 5.2 లక్షల వార్షికాదాయం చూపిస్తే, ఆ తర్వాతి స్థానంలో తమిళనాడుకు చెందిన 33 మంది రూ. 7.2 లక్షల చొప్పున చూపించారు.
తాము పట్టభద్రులమని చెప్పిన 106 మంది సగటు వార్షికాదాయం రూ. 41.28 లక్షలైతే, ఐదో తరగతి పాసయ్యామని చెప్పినవాళ్లకు రూ. 1.41 కోట్లు ఉంది. 46-55 ఏళ్ల మధ్య వారు రూ. 40.54 లక్షల ఆదాయం చూపిస్తే, 66-75 ఏళ్ల మధ్యవారు రూ. 16.72 లక్షలు చూపించారు.