అమరావతి:పశ్చిమ బంగాళాఖాతంలో ప్రవేశించిన ఫొని పెను తుఫానుగా మారడంతో ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఒడిశా తీరం వణికిపోతోంది. ఈ మధ్యాహ్నం నుండి దిశ మార్చుకోవడం మొదలు పెట్టిన పొని ప్రస్తుతం ఈశాన్య దిశగా పయనిస్తోంది. భీకర తుఫాను ప్రభావం ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలలో మొదలైంది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో పలు చోట్ల భారీ ఈదురు గాలులు ఉరుములు, మెరుపులు, వర్షపు జల్లులు ప్రారంభం అయ్యాయి.
ఈ నేపధ్యంలో తుఫాను విషయంలో ఎన్నికల కోడ్ మినహాయింపుపై ప్రభుత్వం నుండి ప్రతిపాదన రాలేదని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది మీడియాకు వెల్లడించారు. ప్రభుత్వం నుండి ప్రతిపాదన వస్తే కేంధ్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకు వెళతాననీ కోడ్ మినహాయింపు పై కీలక నిర్ణయాలు తీసుకునే అధికారం సిఇసికి ఉందని సిఇఒ ద్వివేది తెలిపారు.
ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం ఒడిశా రాష్ట్రంలో తుఫాను ప్రభావిత ప్రాంతాలకు కోడ్ మినహాయింపు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ నేపధ్యంలో ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా పెను తుఫానుగా మారుతున్న నాలుగు జిల్లాలలో ఎన్నికల నియమావళి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. శ్రీకాకుళం, విజయనగరం, నిశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాలలో హై అలర్ట్ ఉందనీ తక్షణం చర్యలు తీసుకునేందుకు కోడ్ మినహాయింపు ఇవ్వాలని ఈసిని చంద్రబాబు కోరారు.