అమరావతి, ఏప్రిల్ 24: ఎన్నికలకు మూడు నెలల ముందు రాష్ట్రంలో ప్రవేశపెట్టిన కొత్త పథకాలకు నిధుల విడుదలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) ఎల్వి సుబ్రమణ్యం ఆరా తీస్తుండటం ఆర్థిక శాఖ అధికారులకు తలనొప్పిగా మారింది. ఆర్థిక శాఖ ఆమోదంతో అమలు చేసిన సంక్షేమ పథకాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సుబ్రమణ్యం ప్రశ్నించడాన్ని ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు తప్పుబడుతున్నారు.
ప్రభుత్వ సమ్మతి లేకుండా ఎన్నికల సంఘం ఇక్కడి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పునీఠాను బదిలీ చేసి ఆయన స్థానంలో ఎల్వి సుబ్రమణ్యంను నియమించిన విషయం తెలిసిందే. ఎల్వి సుబ్రమణ్యం నియామకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు తప్పుబట్టడమే కాకుండా ఒక కేసులో ప్రతిపక్ష నాయకుడు జగన్తో ఆయన సహ నిందితుడిగా ఉన్నారని వ్యాఖ్యానించారు.
ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రమణ్యం వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు నిధుల కేటాయింపుకు సంబంధించి ఆర్ధిక శాఖ నుండి ఆరా తీస్తుండటంతో టిడిపి వర్గాలకు ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. మంత్రివర్గ నిర్ణయాల మేరకు ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు నూతన సంక్షేమ పథకాలకు నిధులు విడుదల చేశారు.
2018-19 బడ్జెట్లో లేని అన్నదాత – సుఖీభవ, పసుపు – కుంకుమ, సామాజిక ఫించన్ పథకాల కోసం ఆ బడ్జెట్లో నిధులు కేటాయించిన పనులను, బిల్లులను ఎందుకు పక్కన పెడుతున్నారని ఆర్థిక శాఖ అధికారులను సీఎస్ ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది. ఇతర పనులకు కేటాయించిన నిధులను కొత్త పథకాల కోసం ఎందుకు మళ్లించారని వివరణ అడుగుతున్నట్లు సమాచారం. పెండింగ్ బిల్లులపై గత వారమే సమీక్ష జరిపిన సీఎస్ మంగళవారం మళ్లీ వాటిపై వరుస సమీక్షలు చేశారు. ఈ పరిణామాలు ఆర్థిక శాఖ అధికారులకు ఇబ్బందిగా మారియి. సీఏస్ సమీక్షలపై ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు స్పందించారు.
పసుపు కుంకుమ, ఫించన్లు, రైతుల పెట్టుబడి సాయంలకు బడ్జెట్లో కేటాయింపులు ఉన్నాయని యనమల రామకృష్ణుడు పేర్కొంటున్నారు. అన్నదాత సుఖీభవకు ఐదువేల కోట్ల రూపాయలు, పసుపు కుంకుమకు నాలుగు వేల కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించడంతో పాటు సామాజిక ఫించన్లకు బడ్జెట్లో కేటాయింపులు ఉండగా, ఈ మూడు పథకాలకు బడ్డెట్లో నిధులు లేవని అనడమేమిటని యనమల ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల కోడ్ రాకముందే రైతులకు మహిళలకు చెక్కులను పంపిణీ చేశామని యనమల చెప్పారు. ఇవి ఎన్నికల కోడ్ కిందకు రావని కోర్టులు కూడా చెప్పాయనీ, వీటిపై సీఎస్ సమీక్షలు నిర్వహించడం సరికాదని యనమల అంటున్నారు. వీటిపై వైసిపి నేతలు వేసిన పిటిషన్లు తిరస్కరణకు గురయ్యాయని యనమల స్పష్టం చేశారు. కొత్తగా సీఎస్ వీటిపై సమీస్తున్నట్లు మీడియాలో రావడం హస్యాస్పదమని యనమల రామకృష్ణుడు అన్నారు.