అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయినప్పటికీ ప్రభుత్వం దానికి ముందడుగు వేయాలనే నిర్ణయించింది. ప్రభుత్వంపై వస్తున్న విమర్శలను ఖాతరు చేయకుండా వచ్చే విద్యాసంవత్సరం నుండి పాఠశాలలో ఒకట తరగతి నుండి ఆరవ తరగతి వరకూ తెలుగు మీడియం విద్యాబోధన స్థానంలో ఇంగ్లీషు మీడియం విద్యాబోధనను ప్రవేశపెడుతూ నేడు విద్యాశాఖ జివో విడుదల చేసింది.
వచ్చే విద్యాసంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లోని ఒకటవ తరగతి నుండి ఆరవ తరగతి వరకూ, ఆ తరువాత ప్రతి ఏటా ఒక తరగతిని పెంచుకుంటూ పదవ తరగతి వరకూ ఇంగ్లీషు మీడియం విద్యను కొనసాగిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. అన్ని తరగతుల్లోనూ తెలుగు ఒక సబ్జెక్ట్గా ఉంటుందని పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనను ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశంతో సహా బిజెపి,జనసేన, వామపక్షాలు, తెలుగు భాషా సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఇంగ్లీషు మీడియం పెట్టినప్పటికీ తెలుగు మీడియం కొనసాగించాలని రాజకీయ పక్షాలు డిమాండ్ చేశాయి.
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం విద్యాబోధన తప్పనిసరి చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశం ఆమోదించింది. దీనిపై నేడు విద్యాశాఖ జివో ఎంఎస్ నెం.85ను విడుదల చేసింది.