(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: చంద్రబాబు కలల రాజధాని సిఎం జగన్ పూర్తి చేయాలంటే వారి లెక్కల ప్రకారమే కనీసం 35 సంవత్సరాలు పడుతుందని వ్యవసాయ శాఖ మంత్రి కరుసాల కన్నబాబు అన్నారు. అసెంబ్లీలో కన్నబాబు గత ప్రభుత్వంలో చంద్రబాబు అనుసరించిన విధానాలను తీవ్ర స్థాయిలో విమర్శించారు. మొత్తం వ్యవస్థను గాలికి వదిలివేసి చంద్రబాబు అత్యాశ, దుర ఆలోచనతో మహానగరాన్ని కట్టాలని భావించడం వల్లనే నేడు ఈ పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు.
మనుషులందరూ ఒక్కటేనని గుర్తించలేని వారు నాయకులు కాలేరనీ, పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు సర్దుకుపోవాలనీ ప్రతిపక్షనేతకు కన్నాబాబు సూచించారు. సర్దుకుపోతే అభివృద్ధి వద్దన్నట్లు కాదని అన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగకపోవడమే సమస్యలకు మూల కారణమనీ, తమ ప్రాంతం అభివృద్ధి కాలేదనే తెలంగాణ ఉద్యమం వచ్చిందనీ వెల్లడించారు. ఏపికి అభివృద్ధి వికేంద్రీకరణే శరణ్యమని రెండు కమిటీల నివేదికలు వచ్చాయని, గతంలో శ్రీకృష్ణ, శివరామకృష్ణ కమిటీలు కూడా ఇదే విషయం చెప్పాయని గుర్తుచేశారు. వనరులు ఉపయోగించుకుంటూ అన్నికులాలు, వర్గాలకు, ప్రాంతాలకు న్యాయం చేయడం కోసమే సీఎం జగన్ మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు.
సూపర్ కేపిటల్ వద్దని శివరామకృష్ణ కమిటీ చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా కన్నబాబు గుర్తుచేశారు. గ్రీన్ఫీల్డ్, ఉన్న నగరం అభివృద్ధి చేయడం, పాలనా వికేంద్రీకరణ చేయడం ఇలా మూడు ఆప్షన్లు ఇచ్చారని చెప్పారు. అమరావతి గ్రాఫిక్స్ సిటీగానే మిగిలిపోయిందని కన్నబాబు విమర్శించారు. సినిమా డైరెక్టర్లతో సెట్టింగులు వేయించి, డిజైన్ల పేరిట నాలుగేళ్ల కాలం వృథా చేశారని అన్నారు. లక్షల కోట్లతో అమరావతి నిర్మిస్తామని చెప్పి అయిదేళ్లలో కేవలం అయిదు వేల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారని అన్నారు.
అమరావతి నిర్మిస్తే రెండు లక్షల ఉద్యోగాలు వస్తాయా అని కన్నబాబు ప్రశ్నించారు. అమరావతిలోనే అభివృద్ధి కేంద్రీకరిస్తే, తమ పరిస్థితి ఏంటని మిగతా ప్రాంతాల వారు ప్రశ్నిస్తున్నారనీ, వారికి చంద్రబాబు ఏం సమాధానం చెప్తారని అన్నారు.
రైతులు, ఎన్జివోలు ఫిర్యాదులు చేయడంతో నిధులు ఇవ్వలేమని వరల్డ్ బ్యాంకు కూడా వెనక్కి వెళ్లిపోయిన విషయాన్ని కన్నబాబు గుర్తుచేశారు. అమరావతి కొంత మందికే కలల రాజధాని అని, మాయల పకీరు ప్రాణం చిలుకలో ఉన్నట్టుగా చంద్రబాబు ప్రాణం అమరావతిలో ఉందని వ్యంగంగా విమర్శించారు.అమరావతి ప్రాంతంలో ఉన్న మంగళగిరి, తాడేపల్లిలో టిడిపి ఓడిపోవడం రెఫరెండం కాదా అని కన్నబాబు ప్రశ్నించారు. రాబోయే ఎన్నికల్ల తెలుగుదేశం పార్టీకి రెండే సీట్లు వస్తాయని ఎద్దేవా చేశారు.
ఒకప్పుడు మత్స్యకారుల గ్రామంగా ఉన్న విశాఖ నేడు మహానగరం అయిందనీ, విశాఖ నుంచి పరిపాలన కొనసాగించాలనీ సిఎం జగన్ నిర్ణయించారని పేర్కొన్నారు. అమరావతిలోనే అసెంబ్లీ కొనసాగుతుందని కన్నబాబు అన్నారు. విశాఖ మావోయిస్టు ప్రభావిత ప్రాంతమని దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్ సమీపంలోనే నాటి మంత్రి మాధవరెడ్డిని హత్య చేయలేదా అని గుర్తు చేస్తూ అంత మాత్రాన హైదరాబాద్ నుంచి రాజధాని మారుస్తారా అని కన్నబాబు ప్రశ్నించారు. రాయలసీమకు రాజధాని దూరం అనేది పెద్ద విషయం కాదని అన్నారు. ఇంతకు ముందు రాజధానిగా ఉన్న హైదరాబాద్కు శ్రీకాకుళం నుంచి ప్రజలు వెళ్లలేదా అని కన్నబాబు ప్రశ్నించారు.
.